వరంగల్ రూరల్, మే 27(నమస్తే తెలంగాణ): జ్వరసర్వే విజయవంతానికి ఉదాహరణగా నిలిచిన మూడుచెక్కలపల్లి.. వరంగల్ రూరల్ జిల్లా నల్లబెల్లి మండలంలోని మారుమూల గ్రామం. అటవీప్రాంతాన్ని ఆనుకుని ఉన్న గ్రామంలో గిరిజనుల జనాభా ఎక్కువ. ఆరోగ్యం, పారిశుద్ధ్య నిర్వహణపై అవగాహన తక్కువ. ఇటీవల ఇక్కడ జరిగిన రెండు వివాహాల కారణంగా కరోనా సెకండ్వేవ్ వేగంగా వ్యాప్తి చెందింది. గ్రామంలో 371 ఇండ్లు ఉండగా, 46 శాతం ఇండ్లలో వైరస్ బారినపడ్డారు. అదే సమయంలో ప్రభుత్వం ఈ నెల 6 నుంచి 9 వరకు తొలివిడుతలో గ్రామంలో జ్వరసర్వే చేపట్టింది. నాలుగు రోజుల పాటు రెండు బృందాల సభ్యులు ఇంటింటికి వెళ్లారు. జలుబు, దగ్గు, జ్వరం, తలనొప్పి ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నవారి వివరాలు సేకరించారు. మొత్తం 172 మందిలో కరోనా లక్షణాలు ఉన్నట్లు గుర్తించారు.
వైద్యసిబ్బంది మందుల కిట్లను పంపిణీ చేశారు. గ్రామంలోనే ఉండి పర్యవేక్షించారు. దీంతో గ్రామం కుదుటపడటం ప్రారంభమైంది. ఈ నెల 23 నుంచి గ్రామంలో రెండో విడత ఇంటింటా జ్వరసర్వే మొదలైంది. గ్రామపంచాయతీ కార్యదర్శి, అంగన్వాడీ కార్యకర్తలు, ఆశావర్కర్ల బృందం ఆదివారం నుంచి బుధవారం వరకు సర్వే నిర్వహించింది. మండల పంచాయతీ అధికారి కూచన ప్రకాశ్ సర్వేను పర్యవేక్షించారు. సర్వేలో ఆశ్చర్యకర ఫలితాలు వెలుగుచూశాయి. మెడికల్ కిట్లు తీసుకున్నవారిలో 151 మంది పూర్తిగా కోలుకున్నారు. మరో 21 మంది రెండుమూడు రోజుల్లో బాగయ్యేస్థితిలో ఉన్నారు. రెండోవిడత సర్వేలో 21 మందిలో కరోనా వైరస్ను గుర్తించారు. వీరికి కూడా వైద్యసిబ్బంది మెడికల్ కిట్లు అందజేసి పర్యవేక్షిస్తున్నారు. తొలివిడుత జ్వరసర్వేలో కరోనా రోగులు 172 మంది ఉండగా, రెండో విడత సర్వేలో 21కి తగ్గడం జిల్లా అధికారుల్లో ఉత్సాహాన్ని నింపింది. కొద్దిరోజుల్లో గ్రామాన్ని కరోనా రహితంగా మారుస్తామని చెప్తున్నారు.
వరంగల్ రూరల్ జిల్లాలో 401 గ్రామపంచాయతీలు, మూడు మున్సిపాలిటీల పరిధిలో మొత్తం 1,86,624 ఇండ్లు ఉన్నాయి. మొత్తం 790 బృందాలు జ్వరసర్వేలో పాల్గొన్నాయి. గ్రామాల్లో 723, పట్టణాల్లో 67 బృందాలు పర్యటించాయి. తొలివిడత జ్వరసర్వే ఈ నెల 6 నుంచి 9వ తేదీ వరకు జరిగింది. జలుబు, దగ్గు, జ్వరం, తలనొప్పి తదితర ఆరోగ్య సమస్యలున్నవారి వివరాలను సేకరించారు. జిల్లాలో దాదాపు పదకొండు వేల మందికి మందిలో లక్షణాలున్నట్లు గుర్తించారు. వారికి మందుల కిట్లను పంపిణీచేశారు. తర్వాత నేరుగా లేదా, ఫోన్ ద్వారా బాధితులతో మాట్లాడి పర్యవేక్షించారు. రెండోవిడత జ్వరసర్వే 23 నుంచి 27 వరకు చేపట్టారు. 8,783 మందికి కరోనా లక్షణాలు ఉన్నట్టు గుర్తించారు. వీరికి మెడికల్ కిట్స్ అందజేశారు. బాధితులు త్వరలో కోలుకునే అవకాశం ఉందని వైద్యసిబ్బంది తెలిపారు.
గుంపులు గుంపులుగా పనులకు వెళ్లడం, ఇతర కారణాలతో ఇటీవల మా ఊరిలో చాలా మంది కి కరోనా సోకింది. ప్రభు త్వం చేపట్టిన తొలివిడత జ్వరసర్వే లో 172 మందికి వైరస్ లక్షణాలు ఉన్నట్లు తేలింది. వైద్యసిబ్బంది మెడికల్ కిట్లు ఇచ్చిండ్లు. ఎలా వాడా లో, జాగ్రత్తలు చెప్పిండ్లు. ఇంట్లోనే ఉంటూ వారి సూచనలు పాటించి అందరూ కోలుకుంటున్నరు. రెండో విడత జ్వర సర్వేలో గ్రామంలో ఇంకో 21 మందికి కరోనా లక్షణాలు ఉన్నట్టు తేలింది. వారికి కూడా మందులిచ్చిండ్లు. ఇంకోనాలుగురోజులైతే నూరుశాతం రికవరైతది. వైద్యాధికారులు, సిబ్బంది పరిస్థితిని తెలుసుకుని సూచనలు చేస్తున్నరు.
–బానోత్ పూల్సింగ్, గ్రామ సర్పంచ్, మూడుచెక్కలపల్లి
గ్రామంలో జనం గుంపులుగా తిరగడంతో ఇటీవల ఎక్కువ మంది కరో నా బారినపడ్డారు. నాకు, మా సర్పంచ్కు కూడా పాజిటివ్ వచ్చింది. ఇద్దరం హోం ఐసొలేషన్లో ఉన్నం. తొలివిడుత జ్వర సర్వేలో 172 మందికి కరోనా లక్షణాలు ఉన్నట్లు తేలింది. వారందరికీ వైద్య సిబ్బంది మందులు ఇచ్చారు. వాటిని వాడి అందరూ ఇంటివద్దే కోలుకున్నరు. ఇప్పుడందరూ ఆరోగ్యంగా ఉన్నరు. గ్రామ యువత కరోనా కట్టడిపై ప్రజలను చైతన్య పరిచారు. గ్రామంలో పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నం. ప్రతి ఒక్కరూ మాస్క్ ధరిస్తున్నరు.
యాదగిరి, గ్రామపంచాయతీ కార్యదర్శి, మూడుచెక్కలపల్లి