హైదరాబాద్ సిటీబ్యూరో, మే 16 (నమస్తే తెలంగాణ): గర్భిణులకు కరోనా వైరస్ సోకినా గర్భంలో ఉన్నంత వరకు బిడ్డ క్షేమమే. గర్భంలో ఉన్న పిండానికి తల్లినుంచి వైరస్ సోకదు. ఇప్పటి వరకు అలాంటి కేసులు ఎక్కడా నమోదు కాలేదంటున్నారు వైద్యనిపుణులు. గర్భవతులు వైరస్బారిన పడ్డా కడుపులో ఉన్న పిండానికి ఎలాంటి హాని జరగదంటున్నారు. ప్రసవ సమయంలోగాని లేదా ప్రసవం తర్వాత గానీ ఇతర కాంటాక్ట్స్ ద్వారా శిశువుకు వైరస్ సోకే అవకాశాలు అధికంగా ఉన్నట్టు గాంధీ దవాఖాన గైనకాలజిస్టు ప్రొఫెసర్ తాటికుంట విజయకృష్ణ స్పష్టం చేశారు. గర్భిణులపై కరోనా వైరస్ ప్రభావం తక్కువగానే ఉంటుందని, చాలామందిలో లక్షణాలు కనిపించటం లేదని చెప్పారు. దీర్ఘకాలిక వ్యాధులు, రక్తపోటు, రక్తహీనత, థైరాయిడ్ వంటి సమస్యల వల్ల గర్భిణులు తీవ్ర అనారోగ్యానికి గురయ్యే అవకాశాలున్నాయని అన్నారు.
‘కరోనా సోకిన గర్భవతులు చాలా జాగ్రతగా ఉండాలి పౌష్టికాహారం అధికంగా తీసుకోవాలి. పాలు, గుడ్లు, డ్రైఫ్రూట్స్ వంటివి తీసుకోవటం వల్ల కడుపులో ఉన్న పిండం బలంగా ఉంటుంది. తల్లి తీసుకున్న పౌష్టికాహారంతోనే ప్రసవం తర్వాత శిశువు ఆరోగ్యంగా ఉండి రోగ నిరోధక శక్తి అధికంగా ఉంటుంది’ అని ఆయన పేర్కొన్నారు.
కరోనా సోకిన గర్భవతులకు సాధారణ ప్రసవం వల్ల కడుపులో బిడ్డకు వైరస్ సోకే అవకాశముందనేది అపోహ మాత్రమేనని విజయకృష్ణ తెలిపారు. ‘సిజేరియన్ వల్ల బిడ్డకు, తల్లికి అదనపు ఫలితాలేవి ఉండవు. అనవసరంగా సిజేరియన్లు చేయవద్దు. ఇతర అనారోగ్య సమస్యలు ఉంటే తప్పా సెక్షన్లు అవసరం లేదు’ అని వివరించారు. పెద్దగా సమస్యలు ఉండకున్నా, ముందస్తు ప్రసవాలు జరిగే అవకాశాలు ఉన్నాయని చెప్పారు.