కనీసం 50 శాతం పెంచిన కంపెనీలు
ఒక్కో బస్తా డీఏపీపై రూ.700 పెంపు
పెరిగిన ధరలు ఈ నెల నుంచే అమల్లోకి
హైదరాబాద్, ఏప్రిల్ 8(నమస్తే తెలంగాణ): సాగు పెరుగుదలతో సంతోషంగా ఉన్న రైతుపై ఎరువుల ధరల రూపంలో పిడుగుపడింది. ఇప్పటికే పెరిగిన పెట్టుబడి ఖర్చుతో సతమతమవుతున్న అన్నదాతపై ఎరువుల కంపెనీలు భారీ ఎత్తున ధరల భారం మోపాయి. ఇప్పటికే పలు కంపెనీలు పెంచిన ధరలను ప్రకటించగా.. మరికొన్ని ప్రకటించేందుకు సిద్ధంగా ఉన్నాయి. పెరిగిన ధరలను ఈ నెల నుంచే అమలుచేయనున్నట్టు కంపెనీలు ప్రకటించాయి. రైతులు ప్రధానంగా ఉపయోగించే డీఏపీ, కాంప్లెక్స్ ఎరువులపై ఒక్కో బస్తాపై కనీసంగా రూ.450 పెంచాయి. పెరిగిన ధరలను ఇఫ్కో కంపెనీ బుధవారం ప్రకటించింది. డీఏపీ ధర అత్యధికంగా రూ.1,900గా నిర్ణయించింది. ప్రస్తుతం దీని ధర రూ.1,200 ఉండగా.. ఏకంగా రూ.700 పెంచింది. కాంప్లెక్స్ ఎరువులకు సంబంధించి కనీసం రూ.450 పెంచింది. యూరియా ధర నిర్ణయం కేంద్రం చేతుల్లో ఉండటం ప్రస్తుతానికి ధర పెరుగలేదు.
ముడిసరుకు ధర పెరగడం వల్లే..
డీఏపీ, కాంప్లెక్స్ ఎరువుల తయారీకి అవసరమైన ముడిసరుకు ధర పెరగడమే ఎరువుల ధర పెరగడానికి ప్రధాన కారణంగా కంపెనీలు చెప్తున్నాయి. వాస్తవానికి డీఏపీ, కాంప్లెక్స్ ఎరువుల తయారీకి అవసరమైన పాస్పారిక్, అమ్మోనియాను చైనా, అరేబియాతోపాటు ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. అయితే అక్కడ వీటి ధరలు భారీగా పెరిగాయి. పాస్పారిక్ యాసిడ్ ధర ప్రస్తుతం టన్నుకు 689 డాలర్లు ఉండగా అది ఏకంగా 795 డాలర్లకు పెరిగిందని కంపెనీలు పేర్కొంటున్నాయి. ఎరువుల ధరల పెరుగుదల భారం రైతులపై తీవ్రంగా పడనున్నది. ఒక్కోరైతుపై పెట్టుబడి ఖర్చు కనీసంగా రూ.3-5 వేలు పెరుగనున్నది. తెలంగాణలో సాగువిస్తీర్ణం భారీగా పెరుగుతుండటంతో ఆ మేరకు ఎరువుల వాడకం కూడా పెరుగుతున్నది. ఈ వానకాలానికి కేంద్రం.. రాష్ర్టానికి 25.50 లక్షల టన్నుల ఎరువులను కేటాయించింది. ఇందులో డీఏపీ 2.50 లక్షల టన్నులు ఉండగా ఎన్పీకే 10.50 లక్షల టన్నులు ఉన్నది.
ఇఫ్కో కంపెనీ నిర్ణయించిన ధరలు
(50 కేజీ బస్తా రూ..ల్లో)
ఎరువు రకం పాతధర కొత్త ధర పెరుగుదల
డీఏపీ 1,200 1,900 700
10-26-26 1,175 1,775 600
12-32-16 1,185 1,800 615
20-20-0-13 925 1,350 425
15-15-15 1,040 1,500 460