ప్రత్యేక ప్రతినిధి, మే20 (నమస్తే తెలంగాణ) రాష్ట్ర ప్రభుత్వం పర్యావరణం, అటవీ అభివృద్ధికి ఇస్తున్న ప్రాధాన్యాన్ని దృష్టిలో పెట్టుకొని అటవీ అభివృద్ధి సంస్థ (ఎఫ్డీసీ) ను పునర్వ్యవస్థీకరించనున్నారు. కార్పొరేషన్ చైర్మన్ ఒంటేరు ప్రతాపరెడ్డి అధ్యక్షతన జరిగిన మూడో వార్షిక సమావేశంలో ఈ మేరకు నిర్ణయించారు. గురువారం ఆన్లైన్ ద్వారా జరిగిన సమావేశంలో పలు కీలక నిర్ణయాలను తీసుకున్నారు. యూకలిప్టస్ను పెంచే సంప్రదాయ పద్ధతుల నుంచి ప్రస్తుత అవసరాలకు తగినవిధంగా మార్పు చెందాలని, అటవీ అభివృద్ధి సంస్థను ఆ దిశగా తీర్చిదిద్దాలని నిర్ణయించారు. గజ్వేల్ జిల్లా ములుగు సమీపంలో సుమారు 20 ఎకరాల్లో సెంట్రల్ నర్సరీని ఎఫ్డీసీ తరపున ఏర్పాటుచేయాలని ప్రతిపాదించారు. ప్రస్తుతం మాసబ్ట్యాంక్లో అద్దె భవనంలోఉన్న ఎఫ్డీసీ కార్యాలయానికి బదులుగా కొత్త భవన సముదాయాన్ని హైదరాబాద్లో కొత్తగూడలో నిర్మించాలని నిర్ణయించినట్టు ఒంటేరు ప్రతాపరెడ్డి తెలిపారు. దీనికి ఎకో టూరిజం-ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కాంప్లెక్స్గా నామకరణం చేయనున్నారు.