హైదరాబాద్, సెప్టెంబర్ 1 (నమస్తే తెలంగాణ): ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన విధానాలతో తెరపినపడుతున్న తెలంగాణ రైతులకు అండగా నిలవాలని మంత్రులు కే తారకరామారావు, గంగుల కమలాకర్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న మంత్రులు బుధవారం కేంద్ర పరిశ్రమలు, టెక్స్టైల్స్, ప్రజాపంపిణీశాఖల మంత్రి పీయూష్గోయల్తో సమావేశమయ్యారు. తమ శాఖల పరిధిలోని వివిధ అంశాలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. యాసంగిలో రాష్ట్రంలో 55 లక్షలకుపైగా ఎకరాల్లో వరి సాగవ్వగా 92.35 లక్షల మెట్రిక్ టన్నుల ధా న్యం సేకరించామని చెప్పారు. ఇందులో 62.82 లక్షల టన్నుల బియ్యం ఎఫ్సీఐకి అం దించామని, మిల్లింగ్ ప్రక్రియ కొనసాగుతున్నదని పేర్కొన్నారు. ఈ దశలో 24.57 లక్షల టన్నుల పారాబాయిల్డ్ రైస్ తెలంగాణ నుంచి తీసుకుంటామని ఎఫ్సీఐ చెప్తున్నదని, దీనివల్ల తెలంగాణ రైతులు తీవ్రంగా నష్టపోతారని వివరించారు. యాసంగిలో ఎఫ్సీఐకు 80-90 శా తం పారాబాయిల్డ్ రైస్ ఇవ్వడానికి అనుమతించాలని కోరారు. తెలంగాణలో అధిక ఉష్ణోగ్రతల కారణంగా యాసంగిలో సేకరించిన ధా న్యాన్ని రా రైస్గా మిల్లింగ్ చేస్తే విరిగిపోతుందని చెప్పారు. కాబట్టి, 50 లక్షల టన్నుల పారాబాయిల్డ్ రైస్, 12.82 లక్షల టన్నుల రా రైస్ తీసుకోవాలని కోరారు. 2019-20 సీజన్లో ఎఫ్సీఐ వెరిఫికేషన్ కోసం మిల్లింగ్ను దాదాపు నెలరోజులు ఆపడంతో తీవ్ర నష్టం జరిగిందని, ఈసారి గడువును 30 రోజులు పెంచాలని విన్నవించారు. వానకాలంలో రాష్ట్రంలో ధాన్యం దిగుబడి 145 లక్షల టన్ను ల వరకు ఉంటుందనే అంచనాలున్నాయని, ధాన్యం సేకరణను 80 లక్షల మెట్రిక్ టన్నులకు పెంచాలని కోరారు. ఈ మేరకు గతంలో హామీ ఇచ్చారని గుర్తుచేశారు. వీటితోపాటు ధా న్యం సేకరణలో కేంద్రం తీసుకురానున్న నిబంధనలను ఉపసంహరించుకోవాలని కోరారు.
మెగా టెక్స్టైల్ పార్క్కు సహకరించాలి
వరంగల్లో స్థాపిస్తున్న దేశంలోనే అతిపెద్ద కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్కు కేంద్రం సహకారం అందించాలని మంత్రి కేటీఆర్ కోరారు. రెండువేల ఎకరాల్లో పార్క్ను ఏర్పాటుచేస్తున్నామని, తొలివిడతగా 1,200 ఎకరాలను పలు కంపెనీలకు కేటాయించామని చెప్పారు. దీనిని మెగా టెక్స్టైల్ పార్క్గా ప్రకటించాలని ఐదేండ్లుగా కోరుతున్న విషయాన్ని గుర్తుచేశారు. ఇప్పటికైనా మిత్ర పథకం కింద గుర్తించాలని కోరారు. కేంద్రం 2017లో ఇచ్చి న హామీ మేరకు హైదరాబాద్లో ‘నేషనల్ డిజైన్ సెంటర్’ను ఏర్పాటుచేయాలని మంత్రి కేటీఆర్ విజ్ఞప్తిచేశారు. ఈ కేంద్రం స్వయం సమృద్ధి సాధించే వరకు వచ్చే నష్టంలో సగాన్ని భరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదని స్పష్టంచేశారు. దీనికి వెంటనే అనుమతులు మంజూరు చేయాలని కోరారు.