పేద రైతులు, యువతకు ఆర్థికపరమైన అవకాశాలు కల్పించేందుకు వ్యవసాయ, వ్యాపారాలకు సంబంధించిన యంత్రాలను అందించి ఆదుకుంటున్న మర్రి రాజశేఖర్ రెడ్డి అభినందనీయుడని రాష్ట్ర చామకూర మల్లారెడ్డి కొనియాడారు. ఘట్కేసర్ మండల పరిధి కొర్రెములలోని జేకే కన్వెన్షన్ హాల్లో మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గ టీఆర్ఎస్ ఇన్చార్జి మర్రి రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో పేద రైతులు, నిరుద్యోగ యువతకు పలు యంత్రాలను మంత్రి మల్లారెడ్డి బుధవారం అందజేశారు. ఎంఎల్ఆర్ ఇంజినీరింగ్ కళాశాలలోని డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ సహకారంతో తయారు చేసిన యంత్రాలను రాజశేఖర్ రెడ్డి, ఎంపీపీ సుదర్శన్ రెడ్డిలతో కలిసి లబ్ధిదారులకు అందజేశారు.
సీఎం కేసీఆర్ చేపడుతున్న ఆర్థిక, సంక్షేమ పథకాల్లో భాగంగా మర్రి రాజశేఖర్ రెడ్డి తనవంతు కృషిగా 42 లక్షలు విలువ చేసే పవర్ టిల్లర్, పురుగుల మందు పిచికారీ యంత్రం, వేరుశనగ నూనె తయారు చేసే యంత్రం, చెరుకు రసం తీసే యంత్రాలను లబ్ధిదారులకు అందజేయటం అభినందనీయమని చెప్పారు. మర్రి రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ పేద రైతులు, వ్యాపారులకు ఆర్థికపరమైన వెసులుబాటు కల్పించటంతోపాటు భవిష్యత్పై భరోసా కలిగించేందుకు సహకరిస్తున్నామన్నారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ బండారి శ్రీనివాస్ గౌడ్, మండల సహకార సంఘం చైర్మన్ సింగిరెడ్డి రాంరెడ్డి, రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు కొంతం అంజిరెడ్డి, సర్పంచ్ల సంఘం మండల అధ్యక్షుడు ఓరుగంటి వెంకటేశ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
చేసుకున్న రోజే కూలీ. లేని రోజు ఉపాసమే. సొంత వ్యాపారం పెట్టుకుందామంటే పైసలు లేవు. నాలాంటి పేదోళ్ల బాధలు తెలిసిన రాజశేఖర్ రెడ్డి సొంత పైసలు ఖర్చుపెట్టి చెరుకు రసం తీసే మిషన్ ఇచ్చిండు. దీంతో రోజూ డబ్బులు సంపాదించుకొని మూడు పూటలు తింటామనే నమ్మకం కలిగింది. ఆయన సల్లంగా ఉండాలే. నాతోపాటు మండలంలోని చాలా మందికి మిషన్లు ఇచ్చి ఆదుకున్నడు. అందకూ రాజశేఖర్ అన్నను ఆదర్శం తీసుకోవాలే. – లక్ష్మీనర్సమ్మ, మర్పల్లిగూడ
కూలీ పనులకు వెళ్లకుండా స్వయం ఉపాధిని ఎంచుకొని జీవించాలని కలలు కన్నా. పేదోళ్ల కోసం రాజశేఖర్ అన్న సహాయం చేస్తుండు అని తెలిసి ఎంపీపీ సుదర్శన్ రెడ్డిని అడిగితే వెంటనే నూనె తయారీ యంత్రం ఇచ్చి ఆదుకుండు. పేదోళ్ల కోసం అన్నీ చేస్తామని చెప్పేటోళ్లను చూసిన గానీ ఎవరూ చేయలేదు. చెప్పకుండానే బతుకుదెరువు చూపిండు. రాజశేఖర్ అన్న సల్లంగా ఉండాలే. దేవుడి లెక్క వచ్చి ఆదుకుండు.- చిలుగూరి సుజాత, అవుషాపూర్