హైదరాబాద్, ఆగస్టు 24 (నమస్తే తెలంగాణ): వచ్చే యాసంగి సీజన్నుంచి దొడ్డురకం ధాన్యాన్ని కొనుగోలు చేయబోమని ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్సీఐ) స్పష్టంచేసింది. ఇకపై సన్న వడ్లను మాత్రమే కొంటామని తెలిపింది. మంగళవారం వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి నివాసంలో జరిగిన సమావేశంలో ఎఫ్సీఐ జీఎం దీపక్శర్మ ఈ విషయాన్ని తేల్చిచెప్పారు. ఇప్పటికే దేశంలో దొడ్డు బియ్యం నిల్వలు భారీగా పేరుకుపోయాయని తెలిపారు. ఈ బియ్యాన్ని ఎక్కువగా ఉపయోగించే కర్ణాటక, తమిళనాడు, కేరళలో వాడకం తగ్గడంతోపాటు.. ఆ యా రాష్ర్టాల్లో దొడ్డు వడ్ల ఉత్పత్తి కూడా పెరిగిందని చెప్పా రు. ఈ నేపథ్యంలో తెలంగాణ నుంచి దొడ్డు వడ్లు కొనడం సాధ్యం కాదని పేర్కొన్నారు. రాష్ట్రం లో యాసంగి సీజన్లో మెజార్టీ రైతులు దొడ్డు వడ్లనే సాగుచేస్తారు. వీటి ఉత్పత్తి కూడా భారీగా వస్తుంది. గత యాసంగి సీజన్లో రాష్ట్రంలో 1.30 కోట్ల టన్నుల ధాన్యం ఉత్పత్తికాగా.. ఎఫ్సీఐ 92.53 లక్షల టన్నులు కొనుగోలు చేసింది. ఆ సమయంలోనూ దొడ్డురకం ధాన్యం కొనుగోలులో ఎఫ్సీఐ పలు ఇబ్బందులకు గురిచేయగా.. సీఎం కేసీఆర్ కల్పించుకొని కొనుగోలుకు ఒప్పించాల్సి వచ్చింది. ఈ ఏడాది సీజన్కు ముందుగానే కొర్రీలు మొదలుపెట్టింది. వానకాలంలోనూ మొత్తం ధాన్యంలో 60 లక్షల టన్నుల కొనుగోలుకు మాత్రమే అంగీకరించింది. ఎఫ్సీఐ నిర్ణయంతో వచ్చే యాసంగిలో రాష్ట్రంలో రైతులకు ఇబ్బందులు ఎదురుకానున్నాయి. ఈ నేపథ్యంలో సన్నాలు సాగుచేయడమే ఉత్తమమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మొత్తానికే వరిసాగును తగ్గించి లాభాలు ఇచ్చే ప్రత్యామ్నాయ పంటలవైపు సాగాలని స్పష్టంచేస్తున్నారు. దొడ్డు వడ్లు కొనుగోలు చేయమంటూ ఎఫ్సీఐ తీసుకున్న నిర్ణయం రైతాంగంపై తీవ్ర ప్రభావం చూపుతుందని రాష్ట్ర మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు గంప నాగేందర్ తెలిపారు. ఈ రంగంపై ఆధారపడిన ధాన్యం మిల్లింగ్ వ్యవస్థ దెబ్బతింటుందని ఆవేదన వ్యక్తంచేశారు.
1.48 కోట్ల టన్నుల ధాన్యం: నిరంజన్రెడ్డి
వానకాలం సీజన్లో 55 లక్షల ఎకరాల్లో వరి సాగవుతున్నదని, 1.48 కోట్ల టన్నుల ధాన్యం ఉత్పత్తి అంచనా వేస్తున్నామని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి తెలిపారు. వానకాలం సాగు, ధాన్యం దిగుబడి, కొనుగోళ్లపై మంగళవారం సమీక్ష సందర్భంగా మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఆహార అవసరాల కోసం సుమారు 56 లక్షల టన్నులు అవసరం కాగా, 20 లక్షల టన్నులు ఇతర రాష్ర్టాలు కొనుగోలు చేసే అవకాశం ఉన్నదని తెలిపారు. వర్షాలు ఆలస్యం కావడంతో పత్తిసాగు తగ్గిందని చెప్పారు. యాసంగిలో రైతులు సన్నాలనే సాగు చేయాలని, వీలైనంతమేర డిమాండ్ ఉన్న వేరుశనగ, నువ్వులు, ఆవాలు, పొద్దు తిరుగుడు వంటి ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించాలని సూచించారు. రాష్ట్రంలో గోదాముల సమస్య తీవ్రంగా ఉన్నదని, ఇప్పటికే నిల్వ ఉన్న పంట ఉత్పత్తులను త్వరగా ఖాళీచేయాలని అధికారులను ఆదేశించారు. గోదాముల సామర్థ్యం పెంచేందుకు 40 లక్షల టన్నుల సామర్థ్యంతో డీపీఆర్ సిద్ధం చేశామని చెప్పారు. సమావేశంలో పౌరసనఫరాలశాఖ కమిషనర్ అనిల్కుమార్, స్పెషల్ కమిషనర్ హన్మంతు, మార్కెటింగ్ డైరెక్టర్ లక్ష్మీబాయి, రైస్మిల్లర్ల అసోసియేషన్ అధ్యక్షుడు నాగేందర్ తదితరులు పాల్గొన్నారు.