హైదరాబాద్, అక్టోబర్ 14 (నమస్తే తెలంగాణ): సీఎం కేసీఆర్ మంత్రాంగం ఫలించింది. గత యాసంగికి సంబంధించిన కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎమ్మార్) సేకరణ విషయంలో నెలకొన్న ప్రతిష్ఠంభనకు ఎఫ్సీఐ తెరదించింది. నిర్ణీత సీఎమ్మార్ కన్నా మరో 20 లక్షల టన్నులు అదనంగా తీసుకొనేందుకు అంగీకరించింది. దీంతోపాటు 2020-21 వానకాలం సీఎమ్మార్ సేకరణ గడువును ఈ నెలాఖరు వరకు, యాసంగి సీఎమ్మార్ సేకరణ గడువును నవంబర్ నెలాఖరుకు పొడిగించింది. ఈ మేర కు గురువారం ఎఫ్సీఐ తెలంగాణ రీజియన్ జీఎం దీపక్శర్మ పౌరసరఫరాలశాఖ కమిషనర్కు లేఖ రాశారు. గత యాసంగిలో రాష్ట్రంలో రికార్డు స్థాయిలో 92.53 లక్షల టన్నుల ధాన్యం సేకరణ జరిగింది. అయితే, 24.75 లక్షల టన్నులకు మించి సీఎమ్మార్ తీసుకొనేదిలేదని ఎఫ్సీఐ భీష్మించింది. దీంతో మిల్లర్లు, రైతులు, రాష్ట్ర ప్రభుత్వానికి ఇబ్బందికర పరిస్థితి ఎదురైంది. ఈ నేపథ్యంలో స్వయంగా రంగంలోకి దిగిన సీఎం కేసీఆర్ ఇటీవల ఢిల్లీలో మకాం వేసి, కేంద్ర మంత్రులకు సమస్యను వివరించారు. దీంతో మరో 20 లక్షల టన్నుల సీఎమ్మార్ తీసుకొనేందుకు ఎఫ్సీఐ అంగీకరించింది. గత యాసంగికి సంబంధించి మొత్తం 40.75 లక్షల టన్నుల సీఎమ్మార్ తీసుకోనున్నది. మొత్తానికి సీఎం కేసీఆర్ చొరవతో గత యాసంగి గండం గట్టెక్కింది.
రేపటి నుంచి మళ్లీ మిల్లింగ్
ధాన్యం నిల్వలను లెక్కించేందుకు నిర్ణయించిన ఎఫ్సీఐ గత 13 రోజులుగా 25 జిల్లాల్లో 225 మిల్లుల్లో క్షేత్రస్థాయి తనిఖీలు నిర్వహించింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా మిల్లింగ్ ప్రక్రియ నిలిచిపోవడంతో.. సకాలంలో సీఎమ్మార్ ఇవ్వడం మిల్లర్లకు సవాలుగా మారనున్నది. ఈ సమస్యను పౌరసరఫరాలశాఖ ఎఫ్సీఐ దృష్టికి తీసుకెళ్లడంతో ఈనెల 16 నుంచి మళ్లీ మిల్లింగ్ ప్రారంభించేందుకు అనుమతించింది. మిల్లుల నుంచి వచ్చిన సీఎమ్మార్ను సకాలంలో అన్లోడ్ చేయాలని నిర్ణయించింది.
సీఎమ్మార్ సేకరణకు కొత్త విధానం
తెలుగుయూనివర్సిటీ: ప్రభుత్వ ఏజెన్సీలు, మిల్లర్ల నుంచి సీఎమ్మార్ కింద సేకరించే ముడి బియ్యం వయస్సును నిర్ధారించడానికి ఇకపై మిశ్రమ సూచిక విధానం అనుసరించనున్నట్టు ఎఫ్సీఐ తెలంగాణ జీఎం దీపక్శర్మ వెల్లడించారు. ఈ పరీక్షలో ఆకుపచ్చ, అవకాడో ఆకుపచ్చ రంగులోకి మారిన నమూనాలను మాత్రమే సేకరిస్తామన్నారు. పసుపు, నారింజ తదితర రంగుల్లోకి మారిన బియ్యాన్ని తిరస్కరిస్తామని తెలిపారు. అంటే తాజాగా మిల్లింగ్ చేసిన సీఎమ్మార్ను మాత్రమే తీసుకొంటామని, నిల్వ ఉంచినవాటిని తీసుకొనేది లేదని పేర్కొంది.
సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు
గత యాసంగికి సంబంధించి అదనపు సీఎమ్మార్ను తీసుకొనేందుకు ఎఫ్సీఐని ఒప్పించిన సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు. ఒకవేళ సీఎం కల్పించుకోకపోతే మిల్లర్లు చాలా ఇబ్బందులకు గురయ్యేవారు. మళ్లీ మిల్లింగ్ ప్రారంభించి సకాలంలో సీఎమ్మార్ ఇచ్చేందుకు కృషిచేస్తాం. నిబంధనల పేరుతో మిల్లర్లను ఇబ్బంది పెట్టొద్దని ఎఫ్సీఐని కోరుతున్నాం. తెలంగాణలోని ప్రత్యేక పరిస్థితులను పరిగణనలోకి తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం. -గంప నాగేందర్, అధ్యక్షుడు, తెలంగాణ రైస్ మిల్లర్స్ అసోసియేషన్