సిటీబ్యూరో, మే 30 (నమస్తే తెలంగాణ): బ్లాక్ఫంగస్తో బాధపడుతున్న వారికి గాంధీ వైద్యులు అండగా నిలుస్తున్నారు. ప్రతిరోజు 15 ఎంతో క్లిష్టమైన శస్త్రచికిత్సలు చేస్తూ కోలుకునేలా చేస్తున్నారు. ఈ తరహా కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో వైద్య, ఆరోగ్యశాఖ అప్రమత్తమైంది. ఇప్పటికే కోఠి ఈఎన్టీ దవాఖాన, గాంధీ దవాఖానల్లో బాధితులకు చికిత్స అందిస్తున్నారు. ఇందుకు సంబంధించి ప్రత్యేక వార్డులు ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. కాగా, సరోజినిదేవి కంటి దవాఖానతో పాటు ప్రభుత్వ దంత వైద్యశాల వైద్యులు సైతం ప్రత్యేక సేవలు అందిస్తున్నారు.
నాలుగు ప్రధాన దవాఖానలైన గాంధీ, ఈఎన్టీ, సరోజినిదేవి కంటి దవాఖాన, ప్రభుత్వ దంత వైద్యశాలకు చెందిన వైద్యులతో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. కరోనా పాజిటివ్ ఉండి బ్లాక్ఫంగస్తో బాధపడుతూ.. పలురకాల ఆరోగ్య సమస్యలున్న రోగులకు గాంధీలో, కరోనా నెగెటివ్ ఉండి కేవలం బ్లాక్ఫంగస్ మాత్రమే ఉంటే కోఠి ఈఎన్టీ దవాఖానలో చికిత్స అందిస్తున్నారు. కోఠి ఈఎన్టీలో 350 పడకలు, గాంధీలో 500 పడకలను బ్లాక్ఫంగస్ రోగుల కోసం కేటాయించారు. ఆదివారం వరకు గాంధీలో 210 మంది, కోఠి ఈఎన్టీలో 325 మంది రోగులు చికిత్స పొందుతున్నట్లు వైద్యాధికారులు వెల్లడించారు.
గాంధీ దవాఖానలో బ్లాక్ఫంగస్కు సంబంధించిన థియేటర్లో మూడు టేబుళ్లను ఏర్పాటు చేశారు. క్లిష్టమైన, పాజిటివ్ కేసులను మాత్రమే గాంధీకి అనుమతిస్తున్నారు. అయితే మూడునాలుగు రోజులుగా బ్లాక్ఫంగస్ కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ప్రతిరోజు 15 శస్త్రచికిత్సలు జరుపాలని అధికారులు నిర్ణయించారు. శనివారం నుంచి ఆపరేషన్ల సంఖ్యను పెంచారు. గాంధీలో ఆదివారం వరకు మొత్తం 19 క్లిష్టమైన ఆపరేషన్లు చేసినట్లు వైద్యవర్గాలు వెల్లడించాయి. ప్రతి శస్త్రచికిత్స కనీసం 10 లక్షలు ఖర్చు అవుతుందని, గాంధీలో నిరుపేదలకు పైసా తీసుకోకుండానే కార్పొరేట్కు దీటుగా ఉచితంగా వైద్యం అందిస్తున్నామని వెల్లడించారు. కాగా, గాంధీలో ఎక్కువ ఇబ్బందులు కలిగి ఉన్న బ్లాక్ఫంగస్ రోగులకు శస్త్రచికిత్స నిర్వహించేందుకు ఐదు విభాగాలతో కూడిన మూడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఈ బృందాలు ఫిఫ్టులవారీగా శస్త్రచికిత్సలు నిర్వహిస్తాయని అధికారులు తెలిపారు.