చింతకాని, డిసెంబర్ 27 : మండలంలోని మత్కేపల్లి నామవరం అడ్డరోడ్డు వద్ద గల వంతెన సమీపంలో మంగళవారం ఎదురెదురుగా ద్విచక్ర వాహనం, లారీ ఢీకొన్న ప్రమాదంలో తండ్రీకొడుకులు దుర్మరణం చెందారు. చింతకాని పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లా కేంద్రంలోని పాండురంగాపురం గ్రామానికి చెందిన చిన్నబోయిన పూలరాజు(40) క్రిస్మస్ పండుగ రోజుకు ముందు బోనకల్ మండలం చిరునోములలోని తన అత్తగారి ఇంటికి ఇద్దరు కుమారులు, భార్యతో కలిసి వెళ్లారు. పెద్దకొడుకు చిరంజీవి(10)కి చిన్న ఆరోగ్య సమస్య తలెత్తడంతో ఖమ్మంలోని ఆసుపత్రిలో చూపించి అటునుంచి పాండురంగాపురం వెళ్దామని మంగళవారం మధ్యాహ్నం ద్విచక్ర వాహనంపై బయలుదేరాడు. నామవరం అడ్డరోడ్డు వద్ద మూలమలుపులో ఎదురుగా వేగంగా వస్తున్న లారీని ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో పూలరాజు, చిరంజీవి తీవ్రంగా గాయపడి అక్కడిక్కడే మృతిచెందారు. సమాచారం అందుకున్న చింతకాని పోలీసులు లారీడ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఖమ్మం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఘటనా స్థలంలో విగతజీవులుగా పడిఉన్న భర్త, కుమారుడిని చూసి భార్య గుండెలవిసేలా విలపించింది. స్వగృహానికి వెళ్తానని తిరిగిరాని లోకాలకు వెళ్లావా.. అంటూ తన భర్త, కుమారుడిని తలచుకుంటూ ఏడుస్తుంటే చూపరుల కళ్లు సైతం చమర్చాయి. ఎస్సై వెంకన్న ఆధ్వర్యంలో ట్రాఫిక్ను నియంత్రించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వెంకన్న తెలిపారు.