హైదరాబాద్, జూలై 18 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ఇంటర్ ఫస్టియర్ విద్యార్థులకు ఆగస్టులో పరీక్షలు నిర్వహించే అవకాశం కనిపిస్తున్నది. ప్రశ్నల సంఖ్యను తగ్గించి, సమయాన్ని రెండుగంటలకే కుదించి పరీక్షలు నిర్వహించే చాన్స్ ఉన్నది. ఈ ఏడాది మేలో జరుగాల్సిన ఇంటర్ పరీక్షలను కరోనా వ్యాప్తి కారణంగా వాయిదా వేశారు. పై చదువుల నిమిత్తం సెకండియర్ పరీక్షలను రద్దుచేసి, ఫలితాలను ప్రకటించారు. కానీ, ఫస్టియర్ విద్యార్థులపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. తాజాగా కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో ఫస్టియర్ విద్యార్థులకు ఆగస్టు మూడోవారంలో పరీక్షలు నిర్వహించాలని భావించిన ఇంటర్బోర్డు అధికారులు.. ప్రతిపాదనలు సిద్ధంచేసి ప్రభుత్వానికి పంపించారు. వీటికి మూడునాలుగురోజుల్లో ఆమోదం లభించి, అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉన్నదని ఓ అధికారి తెలిపారు. ప్రభుత్వం అనుమతిస్తే షెడ్యూల్ విడుదలచేసి పరీక్షలు నిర్వహిస్తామని పేర్కొన్నారు.