హైదరాబాద్, మే 10 (నమస్తే తెలంగాణ): యాసంగి ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి అధికారులను ఆదేశించారు. సోమవారం ధాన్యం కొనుగోళ్లపై సమీక్షించిన అనంతరం మాట్లాడుతూ.. కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యాన్ని వెంటవెంటనే మిల్లులకు తరలించాలని సూచించారు. అవసరమైతే అదనపు రవాణా సౌకర్యం ఏర్పాటుచేయాలని తెలిపారు. మిల్లుల్లో స్థల సమస్య ఎదురైతే.. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని చెప్పారు. తాలు, తరుగు పేరుతో రైతులను ఇబ్బందులకు గురిచేయొద్దని, క్రాప్ బుకింగ్లో పంట వివరాలు లేవనే సాకుతో ధాన్యం కొనుగోలుకు నిరాకరించొద్దని ఆదేశించారు. కరోనా లక్షణాలున్నవారు వెంటనే టెస్టులు చేయించుకోవాలని కోరారు. కరోనా రోగులు హైదరాబాద్కు వెళ్లకుండా జిల్లాస్థాయిలోనే మంచి వైద్యం అందించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.