హైదరాబాద్, జూలై 28 (నమస్తే తెలంగాణ): రైతు సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం అమలుచేస్తున్న పథకాలు సత్ఫలితాలను ఇస్తున్నాయి. రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు పెద్దమొత్తంలో తగ్గుతున్నాయి. బుధవారం లోక్సభ వేదికగా కేంద్రప్రభుత్వం ఈ విషయాన్ని వెల్లడించింది. 2018లో రాష్ట్రంలో 900 మంది రైతులు ఆత్మహత్య చేసుకోగా 2019లో ఈ సంఖ్య 491కి తగ్గిందని ఓ ప్రశ్నకు సమాధానంగా తెలిపింది. 2018తో పోలిస్తే మరుసటి ఏడాది రైతుల ఆత్మహత్యలు బాగా తగ్గిన రాష్ర్టాల జాబితాలో తెలంగాణ మొదటిస్థానంలో ఉన్నదని పేర్కొన్నది. అంతకుముందు ఏడాదితో పోలిస్తే 2019లో తెలంగాణలో 409 మరణాలు తక్కువగా నమోదైనట్టు వెల్లడించింది. రైతుల ఆత్యహత్యలు తగ్గడంలో రైతుబంధు పథకం కీలక పాత్ర పోషిస్తున్నట్టు వ్యవసాయ రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ప్రభుత్వం నుంచి పెట్టుబడి సాయం సకాలంలో అందడంతో అప్పులు చేయాల్సిన అవసరం తప్పుతున్నదని, ఫలితంగా వడ్డీలు మెడకు చుట్టుకొనే ప్రమాదం నుంచి బయటపడుతున్నారని పేర్కొంటున్నారు.
రైతులకు పెట్టుబడి సాయాన్ని అందించేందుకు అమలు చేస్తున్న రైతుబంధు దేశంలోనే మొట్టమొదటిది.
మధ్యప్రదేశ్లో 2017లో 429 మంది రైతులు ఆత్మహత్య చేసుకోగా 2019లో అది 142గా ఉంది.
కర్ణాటకలో 2019లో దేశంలోనే అత్యధికంగా 1,331 మంది రైతులు ఆత్మహత్య చేసుకొన్నారు.
దేశవ్యాప్తంగా 2017లో-5,955, 2018లో-5,763, 2019లో 5,957 మంది రైతులు బలవన్మరణానికి పాల్పడ్డారు.
తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్న వ్యవసాయ విధానాలతో రైతుల్లో ఆత్మైస్థెర్యం పెరిగింది. దీంతో ఆత్మహత్యలు పూర్తిగా తగ్గాయి. పార్లమెంట్లో కేంద్రప్రభుత్వం వెల్లడించిన గణాంకాలే దీనిని స్పష్టంచేస్తున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుచూపుతోనే ఇది సాధ్యమైంది. వ్యవసాయరంగం బలపడితేనే గ్రామీణ ఆర్థికవ్యవస్థ బలోపేతమవుతుంది. రైతుబంధు, రైతుబీమా, ఉచిత విద్యుత్తు, సాగునీటి కల్పన, మద్దతు ధరకు పంటల కొనుగోలు తదితర కార్యక్రమాల ద్వారా రైతుల్లో భరోసా పెరిగింది. రైతుబంధుపై రాజకీయం చేసేవారు కేంద్రం ఇచ్చిన సమాధానాన్ని పరిశీలించి ఆత్మవిమర్శ చేసుకోవాలి.
–వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి