ఏర్గట్ల, జూన్ 28: నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలో బీజేపీ ఎంపీ అర్వింద్కు చేదు అనుభవం ఎదురైంది. ఏర్గట్ల మండలం తాళ్లరాంపూర్ పీఏసీఎస్ వద్ద దీక్షా కార్యక్రమానికి వచ్చిన అర్వింద్ను రైతులు అడ్డుకున్నారు. పసుపు బోర్డు ఇవ్వకపోతే రాజీనామా చేస్తానని ఎన్నికల వేళ ఇచ్చిన హామీకి సంబంధించిన ప్లకార్డులను ప్రదర్శించారు. కారు దిగి వారి దగ్గరికి రాగానే ‘అర్వింద్ రాజీనామా చేయ్.. గోబ్యాక్.. గోబ్యాక్’ అంటూ పెద్ద పెట్టున నినాదాలు చేశారు. రాజీనామా హామీ ఏమైందంటూ నిలదీశారు. దీంతో అర్వింద్ వెళ్లి కారులో కూర్చుండిపోయాడు. ఇదే సమయంలో ఆయన వెంట వచ్చిన బీజేపీ కార్యకర్తలు రైతులపై దాడికి దిగడంతో పలువురికి గాయాలయ్యాయి. ఆగ్రహించిన రైతులు బీజేపీ కార్యకర్తలను ప్రతిఘటించడంతో తోపులాట జరిగింది. కొందరు రైతులు ఎంపీ కారుపై కోడిగుడ్లు విసిరారు. పరిస్థితి ఉద్రిక్తతకు దారి తీసేలా కనిపించడంతో పోలీసులు లాఠీలు ఝళిపించారు. అనంతరం దీక్షా శిబిరం వద్ద అర్వింద్ రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేయడంతో రైతులు అడ్డుకుని అక్కడికక్కడే తిప్పికొట్టారు. అర్వింద్ తిరిగి వెళ్తున్న సమయంలోనూ రైతులు పెద్ద పెట్టున నిరసన తెలిపారు.