రూ.20వేల ఫర్నిచర్కు.. రూ.80వేలు మాయం
స్నేహితులను నమ్మినందుకు రూ.3.10 లక్షలు స్వాహా
పోలీసులను ఆశ్రయించిన బాధితులు
ఇద్దరు యువకులు అరెస్టు
ఇటీవల పెరిగిన డిజిటల్ లావాదేవీలను సైబర్ నేరగాళ్లు ఆసరాగా చేసుకున్నారు. రోజుకో ఎత్తుగడ వేస్తూ.. రెప్పపాటులో బ్యాంకు ఖాతా ఖాళీ చేస్తున్నారు. స్వయంగా బాధితుల చేతినుంచి వారికి డబ్బులు చేరేలా పథకం వేస్తున్నారు. దీనికి ప్రధానంగా క్యూఆర్ కోడ్ను వాడుతున్నారు. ఇలా ప్రతిరోజు అమాయక ప్రజలు సైబర్ నేరగాళ్ల మాటలతో బోల్తా పడుతూనే ఉన్నారు. తాజాగా.. అమీర్పేటకు చెందిన ఓ వ్యక్తి ఓఎల్ఎక్స్లో రూ.20 వేల ఫర్నిచర్ అమ్మకానికి పెడితే.. సైబర్ నేరగాళ్లు కొనుగోలు పేరుతో రూ.80వేలు కొట్టేశారు. ఇదే ప్రాంతానికి చెందిన ఓ యువతి స్నేహితులను నమ్మినందుకు రూ.3.10 లక్షలు ముంచేశారు.
రూ.20వేల విలువైన ఫర్నిచర్ను అమ్ముదామనుకుంటే.. రూ.80 వేలు తన ఖాతాలో దాచుకున్న సొమ్ము పోయిందని బాధితుడు సైబర్క్రైమ్ పోలీసులను ఆశ్రయించిన సంఘటన ఆదివారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. అమీర్పేట్కు చెందిన మహేశ్ తన ఇంట్లో ఉన్న పాత ఫర్నిచర్ను ఓఎల్ఎక్స్ ద్వారా అమ్మకానికి పెట్టాడు. ఓఎల్ఎక్స్లో ఫర్నిచర్ ప్రకటన చూసిన ఓ సైబర్నేరగాడు తాను ఫర్నిచర్ కొంటానంటూ ముందుకొచ్చి రూ.20 వేలకు బేరం కుదుర్చుకున్నాడు. నాకు పేటీఎం ద్వారా రూ.5 పంపించండి, తరువాత మీ ఖాతాను నిర్ధారించుకొని డబ్బులు పంపిస్తానంటూ నమ్మించాడు. మహేశ్ రూ.5 పంపించగానే అవతలి వ్యక్తి రూ.10 తిరిగి పంపించాడు. ఆ తరువాత మీకు డబ్బులు పంపిస్తున్నాను, క్యూఆర్ కోడ్ యాక్సెప్ట్ చేయండి అంటూ సూచించాడు. క్యూఆర్ కోడ్లో రూ.20వేలు పే అంటూ పంపించాడు.
దీన్ని మహేశ్ యాక్సెప్ట్ చేయగానే వెంటనే అతడి ఖాతాలో నుంచి రూ.20 వేలు డెబిట్ అయినట్లు మేసేజ్ వచ్చింది. అదేంటీ నా ఖాతాలో నుంచి డబ్బులు కట్ అయ్యాయంటూ మహేశ్.. సైబర్ చీటర్ను నిలదీశాడు. సార్ అలా జరగకూడదు, నేను వెంటనే మీ డబ్బులు వాపస్ పంపిస్తాను.. మేం ఆర్మీ వాళ్లం నమ్మండి అంటూ మాయ మాటలు చెప్పాడు. అది నిజమని నమ్మిన మహేశ్ రెండో సారి రూ.20వేలు కూడా పే అంటూ క్యూఆర్ కోడ్తో పంపించడంతో యాక్సెప్ట్ చేశాడు. తిరిగి మళ్లీ ఖాతాలో నుంచి రూ.20వేలు మాయమయ్యాయి. రెండో సారి కూడా సైబర్నేరగాడికి ఫోన్ చేయడంతో సార్ మీ డబ్బు పొరపాటున డెబిట్ అవుతుంది, ఇదిగో రూ. 40 వేలు మీకు పంపిస్తున్నానంటూ క్యూఆర్ కోడ్తో పంపించాడు. తిరిగి దానికి యాక్సెప్ట్ చెప్పడంతో మరో రూ.40 వేలు ఖాతాలో నుంచి పోయాయి. ఇలా మొత్తం రూ. 80వేలు మహేశ్ ఖాతాలోనుంచి సైబర్నేరగాళ్లు ఖాళీ చేశారు. దీంతో బాధితుడు ఆదివారం సీసీఎస్ సైబర్క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.