హైదరాబాద్, జూలై 6 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో గ్రామ పంచాయతీల రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. పల్లెల్లో ఆర్థిక పరిస్థితులు తెలిసిన వ్యక్తిగా ముఖ్యమంత్రి కేసీఆర్.. వాటికి వెన్నుదన్నుగా నిలుస్తున్నారు. గతానికి భిన్నంగా క్రమం తప్పకుండా రూ. లక్షల్లో నిధులు అందించడంతోపాటు, నేరుగా పంచాయతీ ఖాతాల్లోనే జమ చేస్తున్నారు. నెలనెలా అందించే నిధులతోపాటు, గ్రామాల్లో శాశ్వతంగా నిలిచిపోయే నిర్మాణాలు, పనులకు నిధులు కేటాయించారు. 2020-21 ఆర్థిక సంవత్సరంలో రూ. 3,416.95 కోట్లు అందించగా.. 2021-22లో ఏప్రిల్, మే, జూన్ నెలలకు సంబంధించి రూ.631.32 కోట్లు విడుదల చేశారు. వీటితోపాటు వైకుంఠధామాలు, డంపింగ్ యార్డు, పల్లె ప్రకృతివనాలు, రైతు వేదికలు, రైతు కల్లాలు, గ్రామాల్లో విద్యుత్తు వ్యవస్థ మెరుగు తదితర పనుల కోసం పెద్దఎత్తున నిధులను కేటాయించారు. రాష్ట్రంలోని 12,769 గ్రామ పంచాయతీలకు 15 నెలల్లోనే రూ. 7,695 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది.
నాడు పన్నులే ఆదాయ వనరు…
గతంలో పంచాయతీలకు పన్నుల వసూళ్ల ద్వారా వచ్చేదే ప్రధానమైన ఆదాయం. ఈ నిధుల ద్వారానే పంచాయతీ సిబ్బంది వేతనాలు, మంచినీటి బోర్లు, వాటి మోటర్లు, కరెంటు బిల్లులు, పారిశుద్ధ్యం పనులు, విద్యుత్తు బల్బులు, ఇతరత్రా చిన్నచిన్న అవసరాలు నిర్వహించాల్సి ఉండేది. దీంతో అభివృద్ధి పనులకు అవకాశం లేకుండా పోయేది. ప్రజాప్రతినిధులు తమ అభివృద్ధి నిధులను కేటాయిస్తేనే ఏమైనా చేయాల్సి వచ్చేది. ప్రభుత్వం నుంచి ఎప్పుడు నిధులొస్తాయో తెలియని పరిస్థితి. కానీ, తెలంగాణ వచ్చాక గ్రామాలకు పూర్వవైభవం తెచ్చేందుకు సీఎం కేసీఆర్ నూతన పంచాయతీరాజ్ చట్టాన్ని తీసుకువచ్చారు. ప్రజాప్రతినిధులను జవాబుదారీ చేశారు. గ్రామ అవసరాల కోసం ప్రతినెలా రూ.285 కోట్లు విడుదల చేస్తున్నారు. ఈ నిధులు 2020 ఏప్రిల్ నుంచి ఠంచన్గా పంచాయతీల అకౌంట్లో జమవుతున్నాయి.
తగ్గిన నిర్వహణ వ్యయం
గతంలో గ్రామాల నిధులు తాగునీటి నిర్వహణకే ఎక్కువగా ఖర్చయ్యేవి. ప్రస్తుతం పైసాభారం పడకుండా మిషన్భగీరథ ద్వారా గ్రామాలకు నీరందుతున్నది. దీని నిర్వహణకయ్యే వ్యయాన్ని ప్రభుత్వమే భరిస్తున్నది. రోడ్లకు ప్రభుత్వమే పెద్దఎత్తున నిధులను ఇస్తున్నది. ఇలా ఒకవైపు పంచాయతీల ఆదాయం పెరుగగా.. మరోవైపు నిర్వహణ వ్యయం ఖర్చులు తగ్గాయి.
కరోనా సంక్షోభంలోనూ…
కరోనా సంక్షోభంతో రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం గణనీయంగా తగ్గినా గ్రామాలకు మాత్రం నిధుల విడుదలలో జాప్యం చేయడం లేదు. పైసా కూడా కోత విధించకుండా నిధులు విడుదలచేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. పైఅధికారుల అనుమతులు అవసరం లేకుండానే గ్రామపాలకవర్గం తీర్మానం చేసి అం దుబాటులోఉన్న ఎన్ని నిధులనైనా ఖర్చు చేసుకునే వెసులుబాటు కల్పించారు.