9వ వార్డులో ఎల్ఈడీ వెలుగులు
వీధి దీపాలు ప్రారంభించిన
ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి
కొడంగల్, జూన్ 6: మునిపల్లోని 9వ వార్డులో ఏర్పాటు చేసిన ఎల్ఈడీ బల్బులను ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి, మున్సిపల్ చైర్మన్ జగదీశ్వర్రెడ్డితో కలిసి ఆదివారం ప్రారంభించారు. స్థానిక ఆర్అండ్బీ అతిథి గృహంలో మార్కెట్ కమిటీ సభ్యులతో సమావేశమాయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం మున్సిపల్ పరిధిలో ఎల్ఈడీ బల్బులను ఏర్పాటు చేశామన్నారు. మున్సిపల్ అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. అన్ని వార్డుల్లో మురుగు కాల్వలు, సీసీ రోడ్ల నిర్మాణాలను ముమ్మరంగా కొనసాగిస్తున్నామన్నారు. మార్కెట్ కమిటీ సభ్యులతో మాట్లాడుతూ ధాన్యం కొనుగోలులో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలిగించవద్దని, కేంద్రానికి వచ్చిన ప్రతి గింజను కొనాలని సూచించారు. ధాన్యం కొనుగోలులో సమస్యలు తలెత్తని విధంగా చర్యలు చేపట్టాలని తెలిపారు.
ధాన్యం నిల్వలకు స్థానికంగా అందుబాటులో ఉండే ప్రభుత్వ, ప్రైవేటు భవనాలతో పాటు ఫంక్షన్ హాళ్లను వాడుకోవాలన్నారు. మండలంలో రెండు రైస్మిల్లులను ఎంపిక చేసి ధాన్యం నిల్వ చేసేలా చర్యలు తీసుకుంటున్నారని, రైస్ మిల్లర్లకు పారితోషికం ఇచ్చే ప్రతిపాదన ఉన్నట్లు పేర్కొన్నారు. ధాన్యం తడువకుండా ఉండేలా ధాన్యం నిల్వలను చేపట్టాలని ఆదేశించారు. ప్రస్తుతం లాక్డౌన్తో కరోనా అదుపులోకి వస్తున్నదని, ఎంపిక చేసిన ప్రతిఒక్కరూ వ్యాక్సినేషన్ వేసుకోవాలన్నారు. కొనుగోలు కేంద్రాల్లో కరోనా నిబంధనలు పాటిస్తూ, కొనుగోళ్లు చేపట్టాలని తెలిపారు. కార్యక్రంలో మున్సిపల్ వైస్ చైర్మన్ ఉషారాజేందర్, కౌన్సిలర్ మధుసూదన్యాదవ్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ భీములు, మాజీ సర్పంచ్ రమేశ్బాబు, మాజీ ఉప సర్పంచ్ గౌసన్, నాయకులు టీటీ రాములు, అంజద్, డా.నవాజోద్దిన్ పాల్గొన్నారు.