హైదరాబాద్, జూన్1 (నమస్తే తెలంగాణ): కరోనా కట్టడి విషయంలో వినూత్న వ్యూహాలు అనుసరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం తాజాగా సరిహద్దు జిల్లాల్లో వైరస్ వ్యాప్తి కట్టడిపై దృష్టి సారించింది. ఆయా జిల్లాల్లో వైరస్ అదుపులోకి తెచ్చేందుకు కృషిచేయాలని, పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షించి సూచనలు చేయాలని సీఎం కేసీఆర్ క్యాబినెట్ మీటింగ్లో అధికారులను ఆదేశించారు. ఈ మేరకు తొలిసారిగా వైద్యారోగ్యశాఖ అధికారుల హెలికాప్టర్ పర్యటనకు ప్రభుత్వం అనుమతిచ్చింది. తక్కువ సమయంలో ఎక్కువ ప్రాంతాలు తిరుగుతూ, సూచనలు చేసేందుకు వీలుగా ఈ అవకాశం కల్పించింది. ఇందులో భాగంగా మంగళవారం హెల్త్ సెక్రెటరీ రిజ్వీ, సీఎం ఓఎస్డీ గంగాధర్, హెల్త్ డైరెక్టర్ జీ శ్రీనివాస రావు హెలికాప్టర్లో ఏపీ సరిహద్దు ప్రాంతాల్లో పర్యటించారు. ఖమ్మం, మధిర, సూర్యాపేట్, కోదాడ తదితర ప్రాంతాల్లో తిరుగుతూ అక్కడి పరిస్థితులపై సమీక్షించారు. వైరస్ కట్టడికి అనుసరించాల్సిన వ్యూహం, తీసుకోవాల్సిన చర్యల గురించి అధికారులకు వివరించారు. పాజిటివిటీ రేటు, లాక్డౌన్ పరిస్థితులు తదితర అంశాల గురించి ఆరా తీశారు. పాజిటివ్ వచ్చిన వారికి కల్పిస్తున్న ఐసోలేషన్ సౌకర్యాలు, ఆసుపత్రుల్లో పేషెంట్ల అడ్మిషన్లు, పాజిటివ్ నమోదైన ప్రాంతాలను కంటైన్మెంట్ చేస్తున్న విధానం తదితర అంశాల గురించి తెలుసుకున్నారు. సరిహద్దు జిల్లాల నుంచి కొత్త కేసులు రాష్ట్రం లోపలికి వచ్చే అవకాశం ఉండటంతో అధికారులు ఆయా ప్రాంతాలపై దృష్టి సారించారు. లాక్డౌన్ నేపథ్యంలో దాదాపు అన్ని జిల్లాల్లో కేసులు తగ్గుముఖం పడుతుండగా, దీన్ని ఇలాగే కొనసాగించి రాష్ట్రంలో కేసులు లేకుండా చేయాలని కృషిచేస్తున్నారు. దీనిపై సీఎం కేసీఆర్ అధికారులకు పూర్తి బాధ్యతలు అప్పగించి నిత్యం సమీక్షలు జరపాలని సూచించారు. బుధవారం జోగులాంబ గద్వాల, వనపర్తి తదితర ప్రాంతాల్లో అధికారులు పర్యటించి పరిస్థితులను సమీక్షించనున్నారు.