కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కొవిడ్ నోడల్ కేంద్రమైన గాంధీ వైద్యాధికారులు అప్రమత్తమయ్యారు. ఈ మేరకు బుధవారం దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ రాజారావు వైద్యాధికారులు, అన్ని విభాగాధిపతులు, వైద్యసిబ్బందితో కలిసి సమావేశమయ్యారు. కరోనా కేసులు పెరిగితే తీసుకోవాల్సిన చర్యలు, చికిత్స ప్రణాళిక తదితర అంశాలపై చర్చించారు. కేసులు పెరుగుతున్న దృష్ట్యా ముందుజాగ్రత చర్యగా గాంధీలో ప్రస్తుతం కొనసాగుతున్న కరోనా పడకల సంఖ్యను 200నుంచి 300కు పెంచనున్నట్లు అధికారులు తెలిపారు. ఇప్పటికే కరోనా రోగుల కోసం ప్రత్యేకంగా 60పడకలతో ఐసీయూ ఏర్పాటు చేశారు. అవసరమైతే ఐసీయూ పడకల సంఖ్యను కూడా పెంచనున్నట్లు అధికారులు వెల్లడించారు. కరోనా వార్డులోని ప్రతీ పడకకు ఆక్సిజన్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రస్తుతం దవాఖానలో 90మంది కరోనా రోగులు ప్రత్యేక చికిత్స పొందుతున్నారని అధికార వర్గాలు తెలిపాయి.