బంజారాహిల్స్,మే 26: పెట్టుబడుల పేరుతో మోసానికి పాల్పడ్డ వ్యాపారవేత్తపై జూబ్లీహిల్స్ పోలీస్స్టేషన్లో చీటింగ్ కేసు నమోదైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జూబ్లీహిల్స్ రోడ్ నం. 36లో గోల్డ్ఫిష్ అబోడ్ ప్రైవేట్ లిమెటెడ్ అనే రియల్ ఎస్టేట్ సంస్థ కార్యాలయం ఉంది. నగరంలోని పలు ప్రాంతాల్లో వెంచర్లు, విల్లాల నిర్మాణం చేస్తున్న ఈ సంస్థ ఎండీ చంద్రశేఖర్ వేగేకు 2013 నుంచి చెన్నుపాటి వేణుమాదవ్(43) అనే వ్యాపారవేత్తతో పరిచయం ఉంది. వెంచర్స్ క్యాపిటల్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థకు యజమానిగా ఉన్న వేణుమాదవ్.. గోల్డ్ఫిష్ అబోడ్ సంస్థలో 10శాతం వాటా తీసుకుంటానని, ఇందుకు రూ.10కోట్లు పెట్టుబడి పెడుతానని రెండేండ్ల కిందట చెప్పారు. ఈ మేరకు గోల్డ్ఫిష్ అబోడ్ సంస్థ యాజమాన్యం అంగీకరించడంతో పాటు 2019 ఏప్రిల్లో వేణుమాదవ్ను అదనపు డైరెక్టర్గా చేర్చుకుని సీఈవోగా నియమించారు.
చెప్పిన మేరకు పెట్టుబడులు పెట్టకపోగా గోల్డ్ఫిష్ సంస్థలోకి తన సొంత కంపెనీలో పనిచేస్తున్న కొందరు ఉద్యోగులను తీసుకువచ్చి వారికి సుమారు రూ.కోటికి పైగా జీతాల రూపంలో చెల్లించారు. దీంతో పాటు సంస్థ నిబంధనలు ఉల్లంఘిస్తూ భారీగా అవకతవకలను పాల్పడ్డారనే ఆరోపణలతో గతేడాది జనవరిలో ఉద్యోగానికి రాజీనామా చేశారు. గోల్డ్ఫిష్ సంస్థ సీఈవో హోదాలో వేణుమాదవ్కు ఇచ్చిన బెంజ్ కారును తిరిగి ఇవ్వాలని కోరినా పట్టించుకోలేదు. సంస్థ నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా సంస్థ వ్యవహారాల్లో తలదూరుస్తూ..బెదిరింపులకు పాల్పడుతున్నారంటూ.. గోల్డ్ఫిష్ అబోడ్ సంస్థ ఎండీ చంద్రశేఖర్ జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సంస్థ సీఈవోగా నిధులు దుర్వినియోగం చేశారని, తన ఇంటికి మరమ్మతుల కోసం రూ.50లక్షలకు పైగా వాడుకున్నారని, చల్లా అగస్థ్యారెడ్డి అనే వ్యక్తికి రూ.40లక్షలు ఇచ్చి తన సొంత కంపెనీకి మళ్లించుకున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. విచారణ చేపట్టిన జూబ్లీహిల్స్ పోలీసులు నిందితుడు చెన్నుపాటి వేణుమాదవ్పై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.