పెద్దేముల్, మే 2 : రైతులు పండించిన ప్రతి గింజకు మద్దతు ధరను కల్పించేందుకు ప్రభుత్వమే కొనుగోలు చేసే విధంగా సీఎం కేసీఆర్, అధికార యంత్రాంగం అన్ని జిల్లా కేంద్రాల్లో, మండలాల్లో, గ్రామాల్లో అవసరమున్నచోట కొనుగోలు కేంద్రాలను ప్రారంభించేందుకు చర్యలు చేపడుతున్నది. తమ గ్రామాల్లోనే ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే పంటలను విక్రయించుకొనేలా వెసులుబాటు కల్పించింది. ఒకప్పుడు రైతులు దళారులను ఆశ్రయించి వారు నిర్ణయించిన ధరలకే పంటలను విక్రయించి మోసపోయేవారు. ఇలాంటి పరిస్థితులు ఎదురుకావద్దనే ఉద్దేశంతో ప్రభుత్వం గ్రామ గ్రామాన కొనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తున్నది.
పెరిగిన సాగు విస్తీర్ణం..
మండలంలో సుమారు 3వేల ఎకరాల్లో రైతులు వరి పంటను సాగు చేస్తున్నారని వ్యవసాయ అధికారులు పేర్కొంటున్నారు. మండల పరిధిలోని గాజీపూర్, బుద్దారం, పెద్దేముల్, మారేపల్లి తండా, చైతన్యనగర్, కొండాపూర్, మన్సాన్పల్లి, జనగాం, దుగ్గాపూర్, మంబాపూర్ తదితర గ్రామాల రైతులు వరి పంటను సాగు చేస్తున్నారు. కాగా గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది వరి పంట సాగు గణనీయంగా పెరిగింది. ముఖ్యంగా రైతులు వరి పంట సాగులో 95% శాతం దొడ్డు రకం వరి సాగు, 5% శాతం సన్న రకం వరి సాగును చేస్తున్నారు.
కేంద్రాల ఏర్పాటుకు ముమ్మర చర్యలు
మండలంలో త్వరలో మొత్తం 11 వరి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించేందుకు వ్యవసాయ అధికారులు ముందస్తు చర్యలు చేపడుతున్నారు. మండల పరిధిలో డీసీఎంఎస్ ఆధ్వర్యంలో కందనెల్లి, మంబాపూర్, రేగొండి, మారేపల్లి, దుగ్గాపూర్, గాజీపూర్, కొండాపూర్ గ్రామాల్లో మొత్తం 7 వరి కొనుగోలు కేంద్రాలు, పీఏసీఎస్ ఆధ్వర్యంలో జనగాం, పెద్దేముల్ గ్రామాల్లో 2 , ఐకేపీ ఆధ్వర్యంలో ఖానాపూర్, మన్సాన్పల్లి గ్రామాల్లో మరో 2 కేంద్రాలను ప్రారంభించడానికి ఇప్పటికే వ్యవసాయ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
వరి కోతలు ప్రారంభం కాలేదు..
మండలంలో ఇంకా పలు గ్రామాల్లో వరి కోతలు పూర్తిస్థాయిలో ప్రారంభం కాలేదు. పంటను కొనుగోలు చేయడానికి వరి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు మండల వ్యవసాయ అధికారులు గ్రామాలవారీగా ఏర్పాట్లు చేయడం సంతోషంగా ఉంది.
త్వరలో కొనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తాం
మండలంలో మొత్తం 11 వరి కొనుగోలు కేంద్రాలు ప్రారంభించడానికి ముందస్తుగా ఏర్పాట్లు చేస్తున్నాం. డీసీఎంఎస్ ఆధ్వర్యంలో 7, పీఏసీఎస్ ఆధ్వర్యంలో 2, ఐకేపీ ఆధ్వర్యంలో 2 కేంద్రాలను త్వరలో ప్రారంభిస్తాం. రైతులు కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి.