న్యూఢిల్లీ: ఆకాశాన్నంటే రీతిలో పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగిపోవడం తాత్కాలికమేనని కేంద్ర పెట్రోలియంశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పేర్కొన్నారు. క్రమంగా వాటి ధరలు తగ్గుముఖం పడతాయని ఏఎన్ఐ వార్తాసంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. ‘అంతర్జాతీయ మార్కెట్కు అనుగుణంగా భారత్లో ఇంధన ధరలు పెరుగుతున్నాయి. కానీ ఇది తాత్కాలికమే. క్రమంగా తగ్గుముఖం పడతాయి. పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించాలని చమురు ఉత్పాదక దేశాలతో చర్చిస్తున్నాం’ అని తెలిపారు.
కరోనాతో దెబ్బ తిన్న దేశ ఆర్థిక వ్యవస్థ పునరుత్తేజపరుచడానికి విధించిన పన్నులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదాయ ‘వనరులుగా సాయ పడుతాయి’ అని ధర్మేంద్ర ప్రధాన్ వ్యాఖ్యానించారు. ఈ నెల ప్రారంభంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ పెట్రోలియం ఉత్పత్తుల ధరల పెరుగుదల అంశం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించినదన్నారు. వీటి ధరల తగ్గింపుపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్చించుకోవాల్సి ఉంటుందన్నారు. కేంద్రంతోపాటు రాష్ట్రాలు కూడా పెట్రోల్, డీజిల్లపై పన్ను విధిస్తున్నాయని చెప్పారు.