నమస్తే తెలంగాణ నెట్వర్క్, జూన్ 12: రాష్ట్రంలో నకిలీ విత్తన విక్రయాలపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతున్నది. ఇందులో భాగంగా గత కొన్ని రోజుల నుంచి వరుసగా దాడులు నిర్వహిస్తున్న పోలీసులు, వ్యవసాయశాఖ అధికారులు శనివారం ఏకంగా రూ.3.10 కోట్ల విలువైన నకిలీ విత్తనాలను స్వాధీనం చేసుకున్నారు. ఖమ్మం జిల్లాలో భారీగా మిరప విత్తనాలను సీజ్చేసి ఏన్కూరుకు చెందిన బైరు వేణుగోపాల్రావు, మంగయ్య అనే వ్యాపారులపై కేసు నమోదు చేశారు. వీరిచ్చిన సమాచారంతో వేగినాటి భాస్కర్రావు అనే డీలర్ను అదుపులోకి తీసుకోవడంతోపాటు మరో 19 మందిపై కేసులు నమోదుచేశారు. మంచిర్యాల జిల్లాలో రూ.51 లక్షల విలువైన నకిలీ బీటీ-3 పత్తి విత్తనాలను పట్టుకొని, తొమ్మిది మందిని అరెస్టు చేసినట్టు రామగుండం పోలీస్ కమిషనర్ వీ సత్యనారాయణ తెలిపారు.
హైదరాబాద్ శివార్లలోని హయత్నగర్ పసుమామ్లా, శాంతినగర్, చింతల్కుంటలోని గోదాముల్లో రాచకొండ పోలీసులు శనివారం అకస్మిక సోదాలు జరిపి 1,000 కిలోలకుపైగా నకిలీ మిర్చి, వరి, కంది, పత్తి విత్తనాలను స్వాధీనం చేసుకున్నారు. రూ.1.16 కోట్ల విలువైన ఈ విత్తనాల్లో అధిక మొత్తం నాసిరకమైనవే. ఈ వ్యవహారంలో గారినేని ఫణి గోపాల్, గోపాల్ కమల్ కిశోర్ సురేఖా, కాకాని వెంకటరమణ అనే వ్యాపారులను అరెస్టు చేసినట్లు రాచకొండ సీపీ మహేశ్ భగవత్ వెల్లడించారు. ఇప్పటివరకు 10మంది నకిలీ విత్తన వ్యాపారులపై పీడీ యాక్ట్ కింద కేసులు నమోదు చేశామన్నారు.
నాసికరం విత్తనాలు, ఎరువులకు సంబంధించిన సమాచారముంటే 8008203193 నంబర్లో ఫిర్యాదుచేయాలని అధికారులు కోరారు. రాష్ట్రవ్యాప్తంగా ఇటీవల నిర్వహించిన దాడుల్లో 229.55 క్వింటాళ్ల బీటీ పత్తి విత్తనాలు, సోయాబీన్, ఇతర విత్తనాలు మరో 74.3 మెట్రిక్ టన్ను లు, 268 కిలోల నకిలీ క్రిమిసంహారక మందులు స్వాధీనం చేసుకున్నట్టు చెప్పారు.