హైదరాబాద్, ఆగస్టు 24 (నమస్తే తెలంగాణ): సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. ఏకంగా రాష్ట్ర మంత్రినే బెదిరించి డబ్బులు లాగేందుకు ప్రయత్నించారు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) పేరిట మంత్రి గంగుల కమలాకర్కు నకిలీ నోటీసులు పం పించారు. ‘ఓ కేసు విషయంలో మీతోపాటు మీ కు టుంబ సభ్యులను అరెస్టు చేయాల్సి ఉన్నది. లేదంటే మనం సెటిల్ చేసుకుందాం’ అంటూ మంత్రికి ఆఫర్ ఇచ్చారు. ఈ నోటీసులు నకిలీవని గుర్తించి ఈడీ హైదరాబాద్ రీజినల్ జాయింట్ డైరెక్టర్ దృష్టికి తీసుకెళ్లటంతో ఆయన హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. నేరస్తుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.
పక్కాగా స్కెచ్.. చిన్న పొరపాటుతో బట్టబయలు
‘ఓ కంపెనీ లావాదేవీల వ్యవహారంలో మీరు, మీ కుటుంబ సభ్యులపై కేసు నమోదైంది. మీ సోదరులు, ఇతర కుటుంబ సభ్యులను అరెస్టు చేయాల్సి ఉన్నది’ అంటూ సైబర్ నేరగాళ్లు తొలుత నోటీసులు పంపించారు. ఆ తర్వాత నేరుగా మంత్రి గంగుల కమలాకర్కు ఓ ల్యాండ్లైన్ నంబర్ నుంచి ఫోన్ చేసి ‘ఈడీ అధికారు లం మాట్లాడుతున్నాం’ అంటూ బెదిరించే ప్రయత్నం చేశారు. అనుమానించిన గంగుల, ఆ ఫోన్ నంబర్ గురించి ఆరా తీయగా అది ఈడీ హైదరాబాద్ జోనల్ కార్యాలయం జాయింట్ డైరెక్టర్ అభిషేక్ గోయల్ ల్యాండ్లైన్ నంబర్ అని తేలింది. దీనిపై లోతుగా ఆరా తీసిన మంత్రి, తనకు వచ్చిన నోటీసులను గమనించి చూడగా పైన అడ్రస్లో ఈడీ జాయింట్ డైరెక్టర్ అని, నోటీసుల చివరణ ఈడీ డిప్యూటీ కమిషనర్ ఈడీ అభిషేక్ గోయల్ ఐపీఎస్ అని బ్రాకెట్లో రాసి ఉన్నది. దాంతో అది నకిలీదని నిర్ధారించుకొన్న గంగుల, అసలు నిందితులను పట్టుకొనేందుకు తాను భయపడినట్టుగా నమ్మించే ప్రయత్నం చేశారు. అంతలోనే ఈ విషయం ఈడీ అధికారులకు తెలియటంతో వారు సీసీఎస్లో ఫిర్యాదు చేశారు. దర్యాప్తు మొదలుపెట్టిన పోలీసులు, ఆ ఫోన్ కాల్ అమెరికా నుంచి వచ్చినట్టు ప్రాథమికంగా గుర్తించారు. కొన్ని యాప్స్ను వినియోగించి ఇలాంటి కాల్స్ చేస్తున్నారని, మనకు ఫోన్ స్క్రీన్పై కనిపించే నంబర్తో సంబంధం లేకుండా ఇంటర్నెట్ కాల్ ద్వారా అవతలి వ్యక్తులు ఇలాంటి బెదిరింపులకు పాల్పడుతున్నట్టు ఓ అధికారి తెలిపారు. తనకు నకిలీ నోటీసులు పంపిన సైబర్ నేరగాళ్లు రూ.కోటి డిమాండ్ చేశారని మంత్రి గంగుల తెలిపారు. అనుమానం వచ్చి ఆరా తీస్తే అవి ఫేక్ నోటీసులని తేలిందని చెప్పారు. తనకు, తన కుటుంబ సభ్యులెవరికీ ఆ నోటీసుల్లో పేర్కొన్న కంపెనీలు లేవని నమస్తే తెలంగాణతో గంగుల పేర్కొన్నారు.