హైదరాబాద్, జూన్ 8 (నమస్తే తెలంగాణ): నాసిరకం విత్తన ముఠాలపై రాష్ట్ర ప్రభుత్వం కొరడా ఝళిపిస్తున్నది. మండల, జిల్లాస్థాయి టాస్క్ఫోర్స్ బృందాలు, స్థానిక పోలీసులతోపాటు ఐజీ నాగిరెడ్డి నేతృత్వంలో ఐదు రాష్ట్రస్థాయి టాస్క్ఫోర్స్ బృందాలు ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తున్నాయి. ఈ ఏడాది జనవరి నుంచి ఈ నెల 5 వరకు రాష్ట్రవ్యాప్తంగా 878 క్వింటాళ్ల నాసిరకం విత్తనాలు స్వాధీనం చేసుకున్నట్టు సీడ్ టాస్క్ఫోర్స్ ఇంచార్జి, నార్త్జోన్ ఐజీ నాగిరెడ్డి వెల్లడించారు. నకిలీ విత్తనాలకు సంబంధించి 101 కేసులు నమోదుచేసి, 159 మంది నిందితులను అరెస్టు చేసినట్టు చెప్పారు. నాసిరకం విత్తనాలు విక్రయించేవారిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదుచేస్తున్నారు. వరుసగా రెండోసారి పట్టుబడితే పీడీయాక్ట్ కింద బుక్ చేస్తున్నారు. ఈ కేసుల్లో ఇప్పటికే 28 మందిపై పోలీసులు పీడీ చట్టాన్ని ప్రయోగించారు.
ప్రభుత్వం నిషేధించిన బీటీ-3రకం పత్తి విత్తనాలతోపాటు నకిలీ విత్తనాలు విక్రయిస్తున్న రెండు ముఠాలను సూర్యాపేట జిల్లా పోలీసులు మంగళవారం అరెస్టుచేశారు. వేర్వేరుచోట్ల సుమారు రూ.60 లక్షల విలువైన 3 టన్నుల నకిలీ విత్తనాలను స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు ఏడుగురిని అరెస్టు చేశారు. మరోవైపు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్ మండలకేంద్రంలోని ఓ ఫర్టిలైజర్ షాపులో ప్రభుత్వ అనుమతిలేని మిరప విత్తనాల ప్యాకెట్లను పోలీసులు, వ్యవసాయ అధికారులు సీజ్ చేశారు. అమ్మకాలకు సిద్ధంగా ఉన్న రూ. 30.24 లక్షల విలువైన 2016 మిరప విత్తనాల ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు.