రిబేటు సదావకాశం
ఆసక్తి చూపుతున్న నగరవాసులు
కార్పొరేషన్, ఏప్రిల్ 16: రాష్ట్ర ప్రభుత్వం మున్సిపాలిటీల పరిధిలో 2021-22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆస్తి పన్ను చెల్లించే వారికి 5 శాతం రిబేటు ఇస్తుండడంతో నగరవాసులు ఆసక్తి చూపుతున్నారు. ఈనెల 31లోగా సంవత్సరం పన్ను చెల్లించే వారికి ఈ పథకం వర్తిస్తుందని అధికారులు తెలిపారు. దీంతో ముందస్తుగా పన్ను చెల్లించేందుకు నగరవాసులు ముందుకు వస్తున్నారు. శుక్రవారం పన్ను చెల్లించేందుకు వచ్చిన వారితో నగరపాలక సంస్థ కార్యాలయం కిటకిటలాడింది. ఉదయం 11 గంటల నుంచే పెద్ద సంఖ్యలో పన్ను చెల్లించేందుకు బల్దియాకు తరలివచ్చారు. ఈ పథకం మరో 15 రోజుల్లోనే ముగియనుండడంతో సాధ్యమైనంత వరకు పన్ను వసూలు చేసేందుకు నగరపాలక సంస్థ రెవెన్యూ అధికారులు సైతం ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రతి ఏటా భారీగా పన్ను ఉన్న యజమానులను గుర్తించి ఈ పథకం కింద ముందస్తుగా చెల్లిస్తే రాయితీ వర్తిస్తుందని వివరిస్తున్నారు. 5 శాతం రాయితీ వస్తుండడంతో ప్రజలు కూడా పన్ను చెల్లించేందుకు ముందుకు వస్తున్నారు. ఇప్పటి వరకు నగరపాలక సంస్థకు ఆస్తి పన్ను సుమారు రూ. 6 కోట్ల మేరకు వసూలైనట్లు అధికారులు పేర్కొంటున్నారు. మరో 15 రోజులు అవకాశం ఉండడంతో పెద్ద సంఖ్యలో పన్ను చెల్లించేలా ప్రచారం చేస్తామని వెల్లడించారు.
ఇవి కూడా చదవండి
మల్లన్న హుండీ ఆదాయం కోటి 82 లక్షలు
పట్టాదారు పాసుపుస్తకం రాలేదని రైతు ఆత్మహత్య