హైదరాబాద్, జూన్ 7 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర సరిహద్దు జిల్లాల్లో కొవిడ్ కేసులు ఎక్కువగా నమోదవుతున్న గ్రామాలపై ప్రత్యేకంగా దృష్టి సారించి నివారణ చర్యలు చేపట్టాలని ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సోమేశ్కుమార్ అధికారులను ఆదేశించారు. ఇంటింటికి తిరిగి కొవిడ్ పరీక్షలు విస్త్రృతంగా చేయాలని ఆదేశించారు. పరీక్షల్లో పాజిటివ్గా తేలితే వారిని ఇండ్లలో కాకుండా ప్రభుత్వ పాఠశాలలు, వసతిగృహాలను ఐసొలేషన్ సెంటర్లుగా ఏర్పాటుచేసి అక్కడికి పంపాలని సూచించారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు సోమవారం భద్రాద్రికొత్తగూడెం, కరీంనగర్, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట జిల్లాల కలెక్టర్లు, డీఎంహెచ్వోలు, ప్రభుత్వ జనరల్ దవాఖానల సూపరింటెండెంట్లతో కొవిడ్ పరిస్థితులపై టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.
కొన్ని గ్రామాల్లో పాజిటివ్ వచ్చిన యువకులు ఐసోలేషన్లో ఉండకుండా తమకేమీ కాలేదంటూ బయటతిరుగుతున్నారని, వారిని జిల్లా కేంద్రాల్లోని ఐసోలేషన్ సెంటర్లకు తరలించాలని సూచించారు. స్థానిక పరిస్థితులకు అనుగుణంగా ప్రణాళిక రూపొందించుకోవాలని ఆదేశించారు. గ్రామీణ ప్రాంతాల్లో లాక్డౌన్ నిబంధనలు సరిగ్గా అమలుకావడం లేదని పెండ్లిళ్లు, అంత్యక్రియలు, ఇతర కార్యక్రమాలకు నిర్ణయించిన పరిమితికి మించి ప్రజలు హాజరవడంతో పాజిటివ్ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయని గుర్తించినట్టు చెప్పారు. లాక్డౌన్ నిబంధనలు పక్కాగా అమలుచేయాలని అధికారులను ఆదేశించారు. టెలికాన్ఫరెన్స్లో వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమశాఖ కార్యదర్శి రిజ్వీ, పబ్లిక్ హెల్త్ డైరెక్టర్, శ్రీనివాసరావు, ముఖ్యమంత్రి కార్యాలయ ఓఎస్డీ డాక్టర్ గంగాధర్ పాల్గొన్నారు.