సికింద్రాబాద్ : జూన్ 23 నుండి హైదరాబాద్లో ఎంఎంటీఎస్ రైలు సేవలు పాక్షికంగా ప్రారంభం అవుతున్నాయి. మార్చి 2020లో ఎంఎంటీఎస్ రైలు సేవలు రద్దైన కారణంగా సీజన్ టికెట్ కలిగిన ప్రయాణికులు కొందరు తమ టికెట్లను పూర్తిగా వినియోగించుకోలేకపోయారు. రైలు సర్వీసులు పునరుద్దరణ నేపథ్యంలో సీజన్ టికెట్లు చెల్లుబాటు అయ్యేలా దక్షిణ మధ్య రైల్వే నిర్ణయం వెలువరించింది. కోల్పోయిన రోజులను జూన్ 23 సర్వీసుల ప్రారంభంతో వినియోగించుకోవచ్చని తెలిపింది. అటువంటి వారి టికెట్లు చెల్లుబాటు అయేందుకు ఆయా రైల్వే స్టేషన్లలోని బుకింగ్ కౌంటర్లలో సంప్రదించాలంది.
అదేవిధంగా నగదు రహిత, కాంటాక్ట్లెస్ విధానంలో టికెట్లు కొనుగోలు చేసే ప్రయాణికులకు బహుమతి ఇచ్చేందుకు అధికారులు ప్రణాళికలు వేస్తున్నారు. అన్ని ప్రధాన ఎంఎంటీఎస్ స్టేషన్లలో లభించే ATVM ల ద్వారా టికెట్లు బుక్ చేసుకునే ప్రయాణీకులకు 3 శాతం బోనస్ చెల్లింపులు అదనపు ప్రయోజనం లభిస్తుంది. అన్రిజర్వ్డ్ టికెటింగ్ సిస్టమ్ (యుటీఎస్) మొబైల్ యాప్ ద్వారా ఎమ్ఎమ్టిఎస్ టికెట్లను కొనుగోలు చేసే వారు యాప్లో లభించే ఆర్-వాలెట్ ద్వారా చెల్లించాలనుకుంటే అదనంగా 5 శాతం బోనస్ లభిస్తుందని తెలిపింది.
సౌత్ సెంట్రల్ రైల్వే జనరల్ మేనేజర్ గజణన్ మాల్యా మాట్లాడుతూ.. ఎంఎంటీఎస్ రైలు వినియోగదారులు సీజన్ టిక్కెట్ల పొడిగింపు సదుపాయంతో పాటు నగదు రహిత టికెటింగ్ సేవలను ఉపయోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు. సాధారణ బుకింగ్ కౌంటర్లలో రద్దీని నివారించడానికి, టికెట్లను కొనుగోలు చేసేటప్పుడు శారీరక సంబంధాన్ని తగ్గించడానికి ఎంఎంటీఎస్ టిక్కెట్ల కొనుగోలు కోసం డిజిటల్ మోడ్ను ఉపయోగించుకోవాలని ఆయన వినియోగదారులకు సూచించారు.