హైదరాబాద్, సెప్టెంబర్ 22 (నమస్తే తెలంగాణ): పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనుల్లో అక్రమ తవ్వకాలేవీ జరుగడం లేదని ప్రత్యేక నిపుణుల కమిటీ స్పష్టం చేసింది. నిబంధనల మేరకే పనులు కొనసాగుతున్నాయని పేర్కొన్నది. ఈ మేరకు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటీ)కు మధ్యంతర నివేదికను సమర్పించింది. అక్రమంగా పెద్దఎత్తున చెరువులను తవ్వి ఆ మట్టిని పాలమూరు -రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగమైన ఉద్దండాపూర్ రిజర్వాయర్ 16 కిలోమీటర్ల కట్ట నిర్మాణానికి వినియోగిస్తున్నారని ఆరోపిస్తూ మహబూబ్నగర్కు చెందిన ఒకరు ఎన్జీటీలో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై విచారణ చేపట్టిన ఎన్జీటీ బెంచ్ వాస్తవాల నిర్ధారణకు కేంద్ర పర్యావరణశాఖ ప్రాంతీయ కార్యాలయం సీనియర్ అధికారి, కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి చెన్నై ప్రాంతీయ కార్యాలయం సైంటిస్ట్, మహబూబ్నగర్ కలెక్టర్, నీరి సంస్థ ప్రతినిధి, గనులు, జియాలజీశాఖ డైరెక్టర్లతో ప్రత్యేక కమిటీని నియమించింది. ఈ కమిటీ ఈ నెల 15, 16 తేదీల్లో ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మిస్తున్న నార్లాపూర్, ఏదుల, వట్టెం, కరివెన, ఉద్దండాపూర్ రిజర్వాయర్లను సందర్శించింది. క్షేత్రస్థాయిలో పరిశీలించిన అంశాలపై ఎన్జీటీకి మధ్యంతర నివేదిక సమర్పించింది. పిటిషనర్ ఆరోపిస్తున్నట్టు అక్రమ తవ్వకాలేవీ జరుగడం లేదని తెలిపింది. ముందస్తుగా అన్ని అనుమతులను తీసుకున్న మేరకే చెరువులను తవ్వుతున్నారని, ఆ పూడికను రిజర్వాయర్ల కట్ట నిర్మాణంలో వినియోగిస్తున్నారని స్పష్టంచేసింది. అందుకు సంబంధించిన అనుమతుల పత్రాలను కూడా సాగునీటిశాఖ అధికారుల నుంచి తీసుకుని పరిశీలించామని వివరించారు. పిటిషనర్ లేవనెత్తిన అభ్యంతరాలు అర్థరహితమని అభిప్రాయపడింది. దీనిపై పూర్తిస్థాయి నివేదిక ఇచ్చేందుకు 4 వారాల గడువునివ్వాలని ఎన్జీటీ బెంచ్కు నిపుణుల బృందం విజ్ఞప్తి చేసింది. పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని తెలంగాణ ప్రభుత్వం సాగుతోపాటు, తాగునీటికి ఉద్దేశించి నిర్మిస్తున్నదని ప్రత్యేక నిపుణుల కమిటీ మరో మధ్యంతర నివేదికను ఎన్జీటీకి సమర్పించింది. పథకం నిర్మాణంలో పర్యావరణ ఉల్లంఘనలకు పాల్పడుతున్నదంటూ ఏపీకి చెందిన కోస్టి వెంకయ్య పిటిషన్ దాఖలు చేయగా.. ఎన్జీటీ ఆదేశాల మేరకు నిపుణుల కమిటీ అధ్యయనం చేసింది. పూర్తిస్థాయి నివేదిక సమర్పణకు ఎనిమిది వారాల గడువు కోరింది.
గౌరవెల్లి ప్రాజెక్ట్ను సందర్శించిన త్రిసభ్య కమిటీ
అక్కన్నపేట: జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటీ) ఏర్పాటు చేసిన కేంద్ర త్రిసభ్య కమిటీ బుధవారం సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలంలోని గౌరవెల్లి ప్రాజెక్టును సందర్శించింది. గౌరవెల్లి ప్రాజెక్ట్కు పర్యావరణ అనుమతుల్లేవని, 1.141 టీఎంసీ నుంచి 8.23 టీఎంసీల సామర్థ్యానికి చెందిన నిర్మాణం చేపడుతున్నారంటూ నిర్వాసితుల్లో కొందరు ఎన్జీటీలో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై అధ్యయనానికి ఏర్పాటైన పీఎస్ కూటియాల్, రమేశ్ కుమార్, అరోకియా లెనిన్తో కూడిన త్రిసభ్య కమిటీ ప్రాజెక్టు అధికారులతోపాటు భూ నిర్వాసితులు, పిటిషన్దారులతో మాట్లాడింది. ఇరిగేషన్ ఈఎన్సీ శంకర్ ఆధ్వర్యంలో ఈ కమిటీకి ప్రాజెక్ట్టుకు సంబంధించిన అంశాలపై పవర్ ప్రజెంటేషన్ ఇచ్చారు. అన్ని అనుమతులు తీసుకొన్నాకే ప్రాజెక్టు నిర్మాణం చేపడుతున్నట్టు డీపీఆర్తోపాటు ఇతరత్రా ఆధారాలు చూపించారు. ప్రాజెక్ట్ ముంపు ప్రాంతం, పరిసరాలు, కట్ట నిర్మాణం, పంపుహౌస్, అండర్ టన్నెల్, డెలివరీ సిస్టమ్ గేట్లు తదితరాలన్నింటినీ కమిటీ క్షుణ్ణంగా పరిశీలించింది. మొదటి దఫాలోనే పిటిషన్దారుల ఇండ్లు ముంపునకు గురికాగా, రీడిజైన్లోనూ ఇండ్లు ముంపునకు గురవుతున్నాయంటూ పిటిషన్లో పేర్కొనడం ఏమిటని ప్రశ్నించింది. పూర్తిస్థాయిలో పరిహారం చెల్లిస్తే తాము వెళ్లిపోతామని తాజాగా ఇండ్లు ముంపునకు గురయ్యే నిర్వాసితులు కమిటీ దృష్టికి తెచ్చారు. ప్రాజెక్టు నిర్మాణంపై తమకు ఎలాంటి అభ్యంతరాల్లేవని పిటిషన్దారులు మినహా ఇతర భూ నిర్వాసితులందరూ కమిటీ సభ్యులకు స్పష్టంచేశారు.