పాజిటివ్ రేటు 32 నుంచి 10శాతానికి తగ్గింది
లాక్డౌన్ను పకడ్బందీగా అమలు చేయాలి
నిజామాబాద్ కలెక్టర్ నారాయణరెడ్డి
ఇందూరు, మే 22 : జిల్లాలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుతున్నదని, ఒకప్పుడు 32శాతంగా ఉన్న పాజిటివ్ రేటు 10శాతానికి తగ్గిందని నిజామాబాద్ కలెక్టర్ నారాయణరెడ్డి అన్నారు. కొవిడ్ నియంత్రణ, లాక్డౌన్ అమలు, నర్సరీల నిర్వహణ, మొక్కల సంరక్షణ తదితర అంశాలపై కలెక్టర్ శనివారం మండల స్థాయి అధికారులతో వీడియోకాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. జిల్లాలో ఒకప్పుడు 2200 మందితో బెడ్స్ నిండిపోగా, ప్రస్తుతం 638 మంది చికిత్స పొందుతున్నారని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ఆక్సిజన్ వాడకం 50శాతానికి తగ్గిందన్నారు. లాక్డౌన్ను కఠినంగా అమలు చేయాలని ఆదేశించారు. లాక్డౌన్ నిబంధనల సడలింపు సమయంలో కూరగాయలు విక్రయించే ప్రాంతాలు, టిఫిన్ సెంటర్లు రద్దీగా ఉంటున్నాయన్నారు. రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో సంతలు ఏర్పాటు చేయనీయొద్దని, మార్కెట్ కమిటీల ద్వారా మొబైల్ రైతు బజార్లను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ప్రతి ఒక్క అధికారి ఉదయం 6 నుంచి 10గంటల వరకు ఫీల్డ్లో ఉండాలన్నారు. మాంసం విక్రయ దుకాణాల వద్ద భౌతికదూరం పాటించేలా చూడాలని, నిబంధనలను అతిక్రమించే వారిపై చర్యలు తీసుకోవాలని, అవసరమైన చోట్ల బారికేడ్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఉదయం 10గంటల తరువాత రోడ్లపై అంబులెన్స్లు తప్ప మిగతా వాహనాలు కనిపించవద్దన్నారు. పీహెచ్సీలు, సీహెచ్సీలు, దవాఖానల బిల్డింగ్లు శుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వ దవాఖానలో డస్ట్బిన్లు ఏర్పాటు చేయాలన్నారు. జిల్లాలో మొదటి విడుత ఇంటింటి జ్వర సర్వే పూర్తయ్యిందని, రెండో విడుత సైతం పూర్తికావాలన్నారు. కొవిడ్ లక్షణాలు తగ్గని వారి ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకోవాలన్నారు. నర్సరీల నిర్వహణ, మొక్కల సంరక్షణపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. అదనపు కలెక్టర్ లత, డీఎంహెచ్ నరేంద్ర తదితరులు పాల్గొన్నారు.
లాక్డౌన్ను అతిక్రమిస్తే కఠిన చర్యలు
లాక్డౌన్ నిబంధనలను ఎవరు అతిక్రమించినా చర్యలు తప్పవని కలెక్టర్ నారాయణరెడ్డి, పోలీస్ కమిషనర్ కార్తికేయ స్పష్టం చేశారు. నగరంలోని గాంధీచౌక్, గంజ్, వీక్లి మార్కెట్, ఖిల్లారోడ్డు, దేవీరోడ్డు, వర్నిరోడ్డు తదితర ప్రాంతాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ లాక్డౌన్ సడలింపు సమయంలో పెద్ద సంఖ్యలో ప్రజలు రోడ్లపైకి వస్తున్నారని, రద్దీని తగ్గించేందుకు తాత్కాలిక మార్కెట్లను ఏర్పాటు చేస్తున్నామన్నారు. టిఫిన్ సెంటర్లలో పార్సిళ్లకు మాత్రమే అనుమతి ఉందన్నారు. సీపీ మాట్లాడుతూ 10గంటల తరువాత పాస్లు ఉన్నవారు తప్ప ఇతరులు రోడ్లపైకి రావొద్దన్నారు. వారివెంట కార్పొరేషన్ కమిషనర్ జితేశ్ వీ పాటిల్, అడిషనల్ కలెక్టర్ చంద్రశేఖర్ తదితరులు ఉన్నారు.
పాజిటివ్ రేటు తగ్గింది..
నిజామాబాద్ జిల్లాలో కరోనా పాజిటివ్రేటు 32 నుంచి 10శాతానికి తగ్గింది. ఆక్సిజన్ వాడకం సైతం 50శాతానికి తగ్గింది. గతంలో జిల్లాలోని దవాఖానల్లో 2,200 మంది చికిత్స పొందగా, ప్రస్తుతం 638 మంది చికిత్స పొందుతున్నారు. కరోనాను మరింత కట్టడి చేసేందుకు లాక్డౌన్ను కఠినంగా అమలు చేయాలి.