హైదరాబాద్: టాలీవుడ్ డ్రగ్స్ కేసులో సినీ ప్రముఖులపై బలమైన ఆధారాలు లేవని ఎక్సైజ్ శాఖ వెల్లడించింది. కెల్విన్ వాంగ్మూలం దర్యాప్తును తప్పుదోవ పట్టించేలా ఉందని పేర్కొన్నది. ఈ మేరకు రంగారెడ్డి జిల్లా కోర్టులో కెల్విన్పై ఆబ్కారీ శాఖ చార్జ్షీట్ దాఖలు చేసింది. ఇందులో నటుల విచారణకు సంబంధించిన విషయాలను ప్రస్తావించింది. నటులు, హోటళ్లకు, విద్యార్థులు, సాఫ్ట్వేర్ ఉద్యోగులకు డ్రగ్స్ అమ్మినట్లు కెల్విన్ వాంగ్మూలం ఇచ్చాడని అందులో వెల్లడించింది. సెలబ్రెటీలపై తగిన ఆధారాలు లభించలేదని పేర్కొంది.
కెల్విన్ వాంగ్మూలం ఆధారంగా సిట్ బృందం పలువురికి నోటీసులు ఇచ్చి ప్రశ్నించిందని చార్జిషీట్లో తెలిపింది. అన్ని సాక్ష్యాలను సిట్ బృందం పరిశీలించి, విశ్లేషించిందని వెల్లడించింది. నిందితుడు చెప్పిన విషయాలను బలమైన ఆధారాలుగా భావించలేమని పేర్కొంది. సెలబ్రిటీలను నిందితులుగా చేర్చేందుకు కెల్విన్ వాంగ్మూలం సరిపోదని, సినీ ప్రముఖులు, ఇతర అనుమానితుల వద్ద డ్రగ్స్ లభించలేదని స్పష్టం చేసింది. పూరి జగన్నాథ్, తరుణ్ స్వచ్ఛందంగా శాంపిల్స్ ఇచ్చారని.. అందులో డ్రగ్స్ ఆనవాళ్లు లేవని ఏఫ్ఎస్ఎల్ తేల్చిందని వెల్లడించారు. నిందితులు, సాక్షుల జాబితాలో సినీ తారల పేర్లు పొందుపరచలేదని ఎక్సైజ్ శాఖ వివరించింది.
కాగా, కెల్విన్కు మంగళూరులో చదువుకునేటప్పటి నుంచి డ్రగ్స్ అలవాటు ఉందని పేర్కొంది. 2013 నుంచి స్నేహితులకు డ్రగ్స్ విక్రయించేవాడని, గోవా, ఇతర దేశాల నుంచి డార్క్వెబ్ ద్వారా డ్రగ్స్ తెప్పించాడని వివరించింది. వాట్సాప్, మెయిల్ ద్వారా ఆర్డర్లు తీసుకొని డ్రగ్స్ సరఫరా చేశాడని వెల్లడించింది. దర్యాప్తు సందర్భంగా అడ్రస్లు, ఇతర కీలక వివరాలను కెల్విన్ వెల్లడించలేదని చార్జ్షీట్లో ప్రస్తావించారు.
అయితే కెల్విన్, అతని స్నేహితులైన నిశ్చయ్, రవికిరణ్ ప్రమేయంపై ఆధారాలున్నాయని అందులో పేర్కొన్నారు. సోదాల సమయంలో వంటగది నుంచి పారిపోయేందుకు కెల్విన్ ప్రయత్నించాడని ఎక్సైజ్శాఖ వెల్లడించింది.