హైదరాబాద్, మార్చి 20 (నమస్తే తెలంగాణ) : పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ అమలు చేసిన త్రిముఖ వ్యూహం అద్భుత ఫలితాన్నిచింది. పార్టీ శ్రేణుల్ని కార్యరంగంలోకి దింపడం, పట్టభద్రుల్ని ఏకం చేయటం, ప్రత్యర్థుల ఆరోపణలకు దీటైన సమాధానాలివ్వటం అనే మూడంచెల వ్యూ హాన్ని పక్కాగా అమలు చేసి ఎన్నికలు జరిగిన రెండు స్థానాల్లోనూ జయకేతనం ఎగురవేసింది. అభ్యర్థుల ఎంపిక నుంచి ప్రచార వ్యూహం వరకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన మాస్టర్ స్ట్రోక్స్తో ప్రత్యర్థులు చిత్తయ్యారు. ఎట్టిపరిస్థితుల్లోనూ గెలిచితీరాలన్న పట్టుదలతో టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు రాత్రింబవళ్లు కష్టపడి పనిచేశారు. మంత్రులు కేటీఆర్, హరీశ్రావు నిత్యం ప్రచార పర్వాన్ని ప్రత్యక్షంగా పర్యవేక్షించి క్యాడర్కు దిశానిర్దేశం చేశారు. ఎన్నికలు జరిగిన జిల్లాల్లో ప్రతి కార్యకర్త తమకు తామే అభ్యర్థిగా భా వించి ప్రచారం నిర్వహించారు. అన్ని వర్గాలను ఏకంచేశారు. మంత్రులు ఎర్రబెల్లి దయాకర్రావు, సత్యవతి రాథోడ్, పువ్వాడ అజయ్, జగదీశ్రెడ్డి, వేముల ప్రశాంత్రెడ్డి, గంగుల కమలాకర్ ఎన్నికల ప్రచార బాధ్యతలను భుజానవేసుకొని ముందుకు నడిపించారు. ప్రతి 50 మంది ఓటర్లకు ఒక ఇంచార్జిని నియమించి ఓటర్లందరినీ ప్రత్యక్షంగా కలిసి ప్రభుత్వ విధానాలు, విజయాలను స్పష్టంగా వివరించారు.
ఉద్యోగాల భర్తీపై చాలెంజ్..
ఉద్యోగాల భర్తీపై ఎన్నికల ప్రచారంలో ప్రతిపక్షాలు చేసిన ఆరోపణలను టీఆర్ఎస్ బలంగా తిప్పికొట్టింది. గత ఆరున్నరేండ్లలో 1,32,899 ఉద్యోగాలు భర్తీచేశామని మంత్రి కేటీఆర్ స్పష్టమైన లెక్కలతో లేఖ విడుదల చేయటమేకాకుండా కావాలంటే ఆయా శాఖలకు వెళ్లి చెక్చేసుకోవాలని చాలెంజ్ విసిరారు. నల్లగొండ-ఖమ్మం-వరంగల్ టీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్రెడ్డి కూడా ఉద్యోగాల భర్తీపై బహిరంగ చర్చకు రావాలని విపక్షాలను సవాల్ చేశారు. ఎన్నికల అనంతరం 50వేల ఉద్యోగాలను భర్తీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించటం ఉద్యోగార్థుల్లో భరోసా నింపింది. దాంతో పట్టభద్రులు అధికారపార్టీకి పట్టం కట్టారు.
చివరి క్షణంలో మెరుపుబాణం
ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో బీజేపీకి ఓటేస్తే ధరల పెరుగుదలకు, ప్రైవేటీకరణకు మద్దతిచ్చినట్టేనని మంత్రి కేటీఆర్ చేసిన ప్రకటన పట్టభద్రులను ఆలోచించేలా చేసింది. ‘మీరు ఓటేయటానికి పోయేముందు గ్యాస్ సిలిండర్కు దండంపెట్టి వెళ్లండి’ అని 2014 లోక్సభ ఎన్నికల సందర్భంగా నరేంద్రమోదీ ఇచ్చిన పిలుపును గుర్తుచేస్తూ కేటీఆర్ చేసిన విమర్శలు కూడా ప్రజల్లోకి బలంగా వెళ్లాయి. ‘ఓ మహానుభావుడు చెప్పినట్టు నేను గ్యాస్ సిలిండర్కు దండంపెట్టుకొని వచ్చిన ఓటేశాను’ అని కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. పెరిగిన ధరలపై ఎక్కుపెట్టిన బాణంగా పట్టభద్రులు భావించారు. కేటీఆర్ ప్రకటన తర్వాత పోలింగ్ పోలింగ్ ఒక్కసారిగా పెరిగింది. పట్టభద్రులు పెట్రోల్ బంకులు, వంటగ్యాస్ సిలిండర్లకు దండంపెట్టి ఓటేయటానికి పోలింగ్ కేంద్రాలకు వరుసకట్టారు.