ఆమనగల్లు, జూలై 10 ః పల్లెలు బాగుపడాలన్న దూరదృష్టితో సీఎం కేసీఆర్ ‘పల్లె ప్రగతి’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ప్రతి నెలా నిధులు విడుదల చేస్తుండడంతో పల్లెల్లో అభివృద్ధి పరుగులు తీస్తున్నది. ఆమనగల్లు మండల కేంద్రానికి 6 కిలో మీటర్ల దూరంలో ఉన్న చెన్నంపల్లి గ్రామం ‘పల్లె ప్రగతి’తో చూడచక్కని పల్లెగా మారింది. సింగంపల్లి పంచాయతీ పరిధిలో ఉన్న చెన్నంపల్లి నూతన పంచాయతీగా ఆవిర్భవించింది. ప్రతి నెలా వచ్చే ప్రభుత్వ నిధులను అభివృద్ధి పనుల కోసం ఒక ప్రణాళిక ప్రకారం వినియోగిస్తున్న పంచాయతీ పాలక వర్గం గ్రామస్తుల మెప్పును పొందుతున్నది. ప్రజాప్రతినిధులు, అధికారుల సమష్టి కృషితో గ్రామాన్ని ఉత్తమంగా తీర్చిదిద్దుతున్నారు. గ్రామ రోడ్డుకు ఇరువైపులా మొక్కలు నాటి సంరక్షిస్తున్నారు. ప్రతీ వీధిలో సీసీ రోడ్డుతో పాటు మురుగు కాల్వలను నిర్మించడంతో పాటు విద్యుత్ దీపాలను వేయడంతో రాత్రి వేళల్లో పట్టపగలును తలపిస్తున్నది. పల్లెప్రకృతి వనం నిర్మాణంతో పల్లెకే కొత్తందం వచ్చింది. నిత్యం పంచాయతీ ట్రాక్టర్తో ఇంటింటికీ వెళ్లి చెత్తను సేకరించి డంపింగ్యార్డుకు తరలిస్తున్నారు. ప్రతి ఇంటికి మరుగుదొడ్డి, ఇంకుడు గుంతలను నిర్మించుకోవడంతో స్వచ్ఛ గ్రామంగా మారింది. అనుకున్న పనులను ఒక ప్రణాళికాబద్ధంగా పూర్తి చేసుకుంటూ జిల్లాలోనే ఆదర్శ గ్రామంగా ఎంపికైంది. ఎమ్మెల్యే జైపాల్యాదవ్ పలుమార్లు గ్రామంలో పర్యటించి సర్పంచ్ శ్రీనయ్యతోపాటు పంచాయతీ పాలక వర్గాన్ని అభినందించిన సందర్భాలు ఉన్నాయి. గ్రామాభివృద్ధికి పూర్తి సహకారాన్ని అందిస్తానని ఎమ్మెల్యే పేర్కొనడంతో పాలకవర్గంలో మరింత ఉత్సాహాన్ని నింపింది.
శరవేగంగా గ్రామాభివృద్ధి…
‘పల్లె ప్రగతి’ కార్యక్రమంలో చెన్నంపల్లి గ్రామం శరవేగంగా అభివృద్ధి చెందింది. ఆదర్శ పంచాయతీ కింద మంజూరైన రూ.20లక్షల నిధులతో పాటు ప్రతి నెలా వచ్చే నిధులతో సీసీ రోడ్లు, వీధి దీపాలు, పల్లె ప్రకృతి వనం, డంపింగ్ యార్డు నిర్మాణాలు పూర్తి కాగా, వైకుంఠధామం పనులు పురోగతిలో ఉన్నాయి. గ్రామమంతా పచ్చని మొక్కలతో ఆహ్లాదకర వాతావరణాన్ని సంతరించుకున్నది. రహదారులకు ఇరువైపులా నాటిన మొక్కలు ఏపుగా పెరిగాయి. గ్రామ నర్సరీలో 12వేల మొక్కలను పెంచుతున్నారు. వైకుంఠధామం నిర్మాణానికి రూ.12.45లక్షలను కేటాయించగా, కంపోస్టు షెడ్డుకు రూ1.50 లక్షలు, అంగన్వాడీ మరుగుదొడ్ల నిర్మాణానికి రూ.లక్ష, వీధి దీపాలకు రూ.3 లక్షల నిధులు కేటాయించారు. హరితహారం కార్యక్రమంలో గ్రామస్తులను భాగస్వాములను చేస్తూ ఇంటింటికీ ఆరు మొక్కలను అందజేశారు.
పారిశుద్ధ్య నిర్వహణ..
తడి, పొడి చెత్తను వేరు చేసేందుకు చెత్త బుట్టలను అందజేశారు. నిత్యం పంచాయతీ సిబ్బంది ఇంటింటికీ ట్రాక్టర్, ట్రాలీ రిక్షాలో వెళ్లి చెత్తను సేకరిస్తున్నారు. చెత్తను ఎక్కడ పడితే అక్కడ వేయకుండా కుండీలను ఏర్పాటు చేశారు. సీజన్ వ్యాధులు సోకకుండా కాలనీలో ప్రత్యేకంగా బ్లీచింగ్ పౌడర్, హైపోక్లోరట్ ద్రావణాన్ని పిచాకారీ చేస్తున్నారు. గ్రామ సభ ఏర్పాటు చేసి గ్రామాభివృద్ధికి గ్రామస్తుల అభిప్రాయాన్ని సేకరిస్తున్నారు. ప్రభుత్వం నుంచి సాధారణ నిధులు రూ.2.89 కోట్లు, రాష్ట్ర ఆర్థిక సంఘం నిధులు రూ.13.32 లక్షలు మంజూరు కాగా, కేంద్ర ఆర్థిక సంఘం నిధులు రూ.1.75కోట్లు మంజూరయ్యాయి.
మరింత అభివృద్ధి చేసుకుంటాం..
గ్రామస్తుల సహకారంతో గ్రామాన్ని మరింత అభివృద్ధి చేసుకుంటాం. ‘పల్లె ప్రగతి’ కార్యక్రమంలో పల్లెకు కొత్తందం వచ్చింది. అభివృద్ధి పనులను పూర్తి చేసుకోవడంతో పాటు భవిష్యత్తు కార్యాచరణను రూపొందించుకుంటున్నాం. పంచాయతీ పాలక వర్గం పూర్తి సహకారాన్ని అందిస్తున్నది.
గ్రామాన్ని పరిశుభ్రంగా మార్చాం…
నిత్యం చెత్తను సేకరించడంతో పాటు గ్రామ వీధుల్లో చెత్త లేకుండా చేసి పరిశుభ్రంగా మార్చాం. హరితహారంలో భాగంగా గ్రామంలో ఖాళీ స్థలాల్లో విరివిగా మొక్కలు నాటాం. ఇంటింటికీ మరుగుదొడ్డిని నిర్మించాం. ప్రతి వీధిలో సీసీ రోడ్డును వేయించడంతో వీధులు శుభ్రంగా మారాయి. ప్రభుత్వ పథకాలు అర్హులకు అందేలా చర్యలు తీసుకుంటున్నాం.