భూపాలపల్లి, ఆగస్టు 3: సరిహద్దులో కాపలా కాయడం సైనికుడి విధి.. కానీ, ఓ స్త్రీతో వివాహేతర బంధం పెట్టుకొని ఆమెను హత్య చేశాడు. శత్రుమూకలను చీల్చిచెండాడాల్సిన వృత్తి అతడిది.. కానీ, జల్సాల కోసం దొంగతనాలకు అలవాటుపడ్డాడు. దేశ సేవలో అమరుడైతే పోలీసులతో సెల్యూట్ కొట్టించుకోవాల్సినోడు.. కానీ, వాళ్లతోనే చేతులకు సంకెళ్లు వేయించుకున్నాడు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం రేగులగూడెం శివారు చల్లపల్లికి చెంది న చల్లా మహేశ్(27) 2004లో ఆర్మీలో చేరాడు. 2011లో మహబూబాబాద్ జిల్లా కేసముద్రానికి చెందిన ఓ మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఆమెతో గొడవపడి హత్య చేశాడు. ఉద్యోగం పోయింది, జైలు శిక్ష పడింది. భార్య కూడా విడాకులిచ్చింది. ఇచ్చిన వరకట్నం డబ్బులు అడగటంతో దొంగతనాలు చేయటం ప్రారంభించాడు. కరీంనగర్, వరంగల్, పెద్దపల్లి జిల్లాల్లో దొంగతనాలు చేసి జైలుకు వెళ్లాడు. 2019లో మహిళ హత్యకేసులో పోలీసులు వరంగల్ సెంట్రల్ జైలుకు పంపారు. ఈ ఏడాది మార్చిలో బెయిల్పై తిరిగివచ్చి మళ్లీ దొంగతనాలు చేయటం ప్రారంభించాడు. దొంగిలించిన బంగారం, వెండి, నగదుతో విజయవాడకు వెళ్లిపోదామనుకున్న మహేశ్ను మంగళవారం భూపాలపల్లిలో పట్టుకున్నట్టు డీఎస్పీ వీ శ్రీనివాసులు తెలిపారు. నిందితుడి నుంచి 3 తులాల బంగారు నెక్లెస్, 180 గ్రాముల వెండి పట్టగొలుసులు, 25 గ్రాముల ఫ్యాన్సీ మొలతాడు, రూ.2.10 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు.