ప్రజలు పాలకుడి గొప్ప మనసుకు పులకించాలి. పాలకుడిని తమ అదృష్టంగా భావించాలి. కలకాలం చల్లగా ఉండాలని దీవించాలి. అడుగనిదీ, చెప్పినదీ, చెప్పనిదీ రకరకాల వరాల రూపంలో పౌరుల అనుభవంలోకి తెచ్చే చల్లని చంద్రుడు ముఖ్యమంత్రి కేసీఆర్. హైదరాబాద్లోని గాంధీ దవాఖానను ‘తెలంగాణ గాంధీ’ అనూహ్యంగా సందర్శించారు. ఈ నోటా, ఆ నోటా ‘దటీజ్ కేసీఆర్’ అని మరోసారి అనిపించారు. సాధారణ రోజుల్లో ఈ సందర్శనకు ఏమంత విశేషం ఉండకపోవచ్చు. కానీ ఆపదలో దైవం ప్రత్యక్షమైన అనుభూతిని గాంధీ దవాఖానలో పేషెంట్లకు కేసీఆర్ కలిగించారు.
కేసీఆర్ గాంధీ సందర్శన మొక్కుబడిగా, అలంకారప్రాయంగా సాగలేదు. ముఖ్యమంత్రి ప్రతి అడుగులోనూ, పలకరింపులోనూ ఆత్మీయత తొణికిసలాడింది. రోగులకు గుండె ధైర్యం కలిగించారు. ప్రభుత్వం మీ వెంటే ఉన్న దన్న నమ్మకం, ఏ లోటూ లేకుండా సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఇండ్లకు క్షేమంగా చేరుతారన్న భరోసా కరోనా బాధితుల్లో కలిగించారు. సర్కారు వైద్యంపై విశ్వాసాన్ని నూరిపోశారు. అత్యంత క్లిష్టతరమైన, కష్టతరమైన ఈ విపత్తులోనూ వృత్తి నిబద్ధత నింగికి ఎగసేలా వెలకట్టలేని సేవలు అందిస్తున్న డాక్టర్లు, నర్సులు, పారిశుద్ధ్య కార్మికులు, ఇతర విభాగాల వీరులను, యావత్ యంత్రాంగాన్ని కేసీఆర్ దిల్ సే అభినందించారు. వ్యాధి సోకిన రోగుల సమీపానికి వెళ్లి పలుకరించిన సన్నివేశాలు కడుపు నింపినట్లయింది. పీడితులు సహా అందరికీ విజయ సంకేతాన్ని చూపుతూ, మనమంతా ఐక్యంగా ఈ గండాన్ని అధిగమించబోతున్నామంటూ పాలకుడిగా తిరుగులేని సంకేతం ఇచ్చారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన ఈ తనిఖీ కచ్చితంగా సత్ఫలితాలనిస్తుంది. ఎక్కడైనా లోటుపాట్లు ఉంటే, సరిచేసుకోవడంలో సంబంధిత యంత్రాంగం కార్యోన్ముఖమవుతుంది. ఇప్పుడు వెళ్లింది కీలకమైన గాంధీకే అయినా, ప్రతి ప్రభుత్వ దవాఖాననూ ముఖ్యమంత్రి చూసినంతటి గంభీరత, అప్రమత్తత ఏర్పడుతుంది. తద్వారా సరాసరి రోగులకు ప్రయోజనకరమే అవుతుంది. వైద్య, ఆరోగ్యశాఖను ఆయన చేపట్టిన రోజు నుంచి మరింత నిశితంగా పర్యవేక్షిస్తున్నారు. ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్కుమార్, మంత్రులు కేటీఆర్, హరీష్రావు, ఉన్నతాధికారులతో సునిశిత పరిశీలనలు జరుపుతూ వ్యూహాలు రచిస్తున్నారు. తెలంగాణలో వైద్య రంగం బలోపేతానికి నిర్దిష్ట కార్యాచరణలో తలమునకలయ్యారు. ఈ క్రమంలోనే కొత్త వైద్య కళాశాలలను మంజూరు చేశారు. ఆయుష్మాన్ భారత్లో చేరడానికి నిర్ణయం తీసుకున్నారు. టీకాల కటకటనూ సాగనంపి, అం దరికీ వ్యాక్సిన్ అందేలా కసరత్తు చేస్తున్నారు.
కేసీఆర్ వైద్యరంగంపై సాగిస్తున్న కసరత్తు మంత్రి హరీష్ రావుతో కలిసి చేపట్టిన గాంధీదవాఖాన సందర్శనతోనే ఆగదు. మొదటి వేవ్లో కేటీఆర్ కూడా వరంగల్ దవాఖానలో పేషెంట్లను పరామర్శించారు. ప్రజా సేవకు కావాల్సిన అర్హతల్లో గట్స్ కలిగి ఉండటం ముఖ్యమని కేసీఆర్ ఆయా సందర్భాల్లో ఉటంకిస్తుంటారు. ఇందుకు తనకు తానే ప్రతీక. అంతే కాదు,కేటీఆర్ కూడా ప్రబల నిదర్శనం.
కేసీఆర్ వైద్యరంగంపై సాగిస్తున్న కసరత్తు మంత్రి హరీష్ రావుతో కలిసి చేపట్టిన గాంధీ దవాఖాన సందర్శనతోనే ఆగదు. మొదటి వేవ్లో కేటీఆర్ కూడా వరంగల్ దవాఖానలో పేషెంట్లను పరామర్శించారు. ప్రజా సేవకు కావాల్సిన అర్హతల్లో గట్స్ కలిగి ఉండటం ముఖ్యమని కేసీఆర్ ఆయా సందర్భాల్లో ఉటంకిస్తుంటారు. ఇందుకు తనకు తానే ప్రతీక. అంతే కాదు, కేటీఆర్ కూడా ప్రబల నిదర్శనం. ప్రాణవాయువు, ఔషధాల వంటివి సమకూర్చడంలో కాలంతో కుస్తీ పడుతున్నారు. ఆరోగ్య తెలంగాణ కోసం ఎంతగానో తపించే ముఖ్యమంత్రి కేసీఆర్ పర్సనల్ హెల్త్ ప్రొఫైల్ వంటి బృహత్ ప్రణాళికలకు జీవం పోశారు. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఒకటైన భారత్లో ఏ రాష్ట్రమూ పూనుకోని సాహసాలను అనుభవంలోకి తెచ్చారు.
విధి లిఖితమో, ఎక్కడో మానవ తప్పిదమో, కుట్రో, మరేమిటో కానీ, ఆ అదృశ్య వైరస్ దేశానికి కునుకులేకుండా చేస్తోంది. మన రాష్ట్రం కూడా మినహాయింపు కాలేకపోయింది. ప్రతి ఒక్కరిలోనూ అదే అలజడి. ఈ ఊబి నుంచి త్వరగా గట్టెక్కించేందుకు మన రాష్ట్ర ప్రభుత్వం అవిశ్రాంతంగా పాటుపడుతోంది. కేసీఆర్ గాంధీ దవాఖాన సందర్శన ఆ దిశగా మరింత మెరుగైన ఫలితాలకు దోహదం చేస్తుంది.
తెలంగాణ ఏర్పడగానే కేసీఆర్ తీసుకున్న మొదటి చర్యలలో సర్కారు దవాఖానలను పటిష్టం చేయడం ఒకటి. కేసీఆర్ కిట్ను ప్రవేశపెట్టడం వల్ల సర్కారు దవాఖానలలో ప్రసవాలు పెరిగిపోయాయి. కేసీఆర్ దృష్టి పెట్టారని తెలువగానే సర్కారు దవాఖానలపై ప్రజలకు నమ్మకం పెరిగింది. సర్కారు దవాఖానలలో రోగులు పెరగడమే ఇందుకు ఉదాహరణ. ఇదేవిధంగా ప్రతి ఒక్కరు ప్రత్యేక వైద్యం కోసం హైదరాబాద్ రావలసిన అవసరం లేకుండా, పట్టణాలలోనే వసతులను మెరుగుపరిచారు. దీనివల్ల హైదరాబాద్ మీద ఒత్తిడి తగ్గింది. ప్రజలకు వైద్యం
అందుబాటులోకి వచ్చింది.
కేసీఆర్ ముందే వైద్య వ్యవస్థను బలోపేతం చేయడం వల్ల కరోనా సమయంలో చికిత్స చేయడం మరింత సులభమైంది. లేకపోతే ఉమ్మడి రాష్ట్ర పరిస్థితులు ఉంటే ఇప్పుడు రాష్ట్రంలో పరిస్థితి ఘోరంగా ఉండేది. కేసీఆర్ ఇంతకాలం వ్యవస్థను మెరుగుపరిచారు. ఇప్పుడు కరోనా కాలంలో రోగులకు మనోధైర్యం కలిగించడానికి, వైద్య సిబ్బందికి ఉత్సాహం నింపడానికి గాంధీ దవాఖానను సందర్శించారు.
ప్రైవేటు, కార్పొరేట్ దవాఖానల్లోనూ కొంచెం మానవత్వం పరిమళించే పరిస్థితులు నెలకొలిపే సత్తా కేసీఆర్కే ఉందని తెలంగాణ ప్రజానీకం నమ్మకంతో ఉన్నది. ప్రజలు తమ సంపాదనలో అధికభాగం విద్య, వైద్యం కోసమే అర్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ రెండు రంగాలను మెరుగుపరచి, ప్రజలకు అందుబాటులోకి తేవడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ యావత్ దేశాన్నే అబ్బురపరిచే విధాన నిర్ణయాలు తీసుకుంటారని ప్రజలు ఆశిస్తున్నారు. ద్వేషించేవారూ దాసోహమనే సాహసి, ప్రజాపక్షపాతి ముఖ్యమంత్రి కేసీఆర్. విద్య, వైద్యరంగాల్లో ప్రజలకు భారం లేకుండా చేస్తే తెలంగాణ సమాజం మన చల్లని చంద్రుడికి రుణపడి ఉంటుంది.
(వ్యాసకర్త: ఫ్రీలాన్స్ జర్నలిస్ట్)