హైదరాబాద్ : మాజీ ఎంపీ మధు యాష్కీ గౌడ్ ఓ పొలిటికల్ టూరిస్ట్ అని పలువురు టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు అన్నారు. యాష్కీకి సబ్జెక్ట్ తక్కువ, సౌండ్ ఎక్కువ అని ఎద్దేవా చేశారు. పీయూసీ చైర్మన్, ఎమ్మెల్యే ఏ.జీవన్ రెడ్డి, ఎమ్మెల్సీలు ఫారూఖ్ హుస్సేన్, పురాణం సతీష్, వీ.గంగాధర్ గౌడ్, ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడారు. ఎమ్మెల్యే జీవన్రెడ్డి మాట్లాడుతూ.. మధు యాష్కీ నిజామాబాద్లో టీఆర్ఎస్ పార్టీ, ప్రభుత్వంపై చేసిన విమర్శలను ఖండిస్తున్నట్లు తెలిపారు. కేసీఆర్కు సరితూగే నాయకులు ప్రతిపక్షాలలో లేరన్నారు. కేసీఆర్ కుటుంబాన్ని తిడితే గొప్పవాడిని అయిపోవచ్చు అనుకుంటున్నారు.
మధుయాష్కీ ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి. సీఎం కేసీఆర్పై ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదు. కాంగ్రెస్ అంటే అవినీతి- అవినీతి అంటే కాంగ్రెస్ అన్నారు. మధు యాష్కీ అమెరికా నేర చరిత్ర అందరికీ తెలుసన్నారు. అరునెలలకు ఒకసారి వచ్చి ప్రెస్ మీట్ పెట్టడం కాదు. గల్లీ నుంచి ఢిల్లీలో పేరు తెచ్చు కోవాలన్నారు. టీఆరెస్ కార్యకర్తలు ఒక్కసారి నోరు తెరిస్తే గాలికి మధుయాష్కీ కొట్టుకుపోతారన్నారు. అవినీతి గురించి యాష్కీ మాట్లాడటం దయ్యాలు వేదాలు వల్లించడమేనన్నారు. లాబీయింగ్ స్పెషలిస్ట్ యాష్కీకి ప్రజా సమస్యలు తెలియవన్నారు. ఎమ్మెల్సీ కవితపై యాష్కీ అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తున్నామన్నారు. మహిళల పట్ల ఆయనకు గౌరవం లేదన్నారు.
ఎమ్మెల్సీ వి .గంగాధర్ గౌడ్ మాట్లాడుతూ.. మధు యాష్కీ ఎన్నికల నుంచి పారిపోయిన వ్యక్తి అన్నారు. గత ఎన్నికల్లో ఆయన బీజేపీకి అమ్ముడు పోయారన్నారు. కాంగ్రెస్ హాయంలో గౌడ కులస్తులకు అన్యాయం జరిగితే నోరెత్తని వ్యక్తి. కేసీఆర్ హాయంలో కుల వృత్తులకు న్యాయం జరుగుతోందన్నారు. కళ్లుండి చూడలేని కబోది యాస్కీ అని నిజామాబాద్ అభివృద్ధి యాష్కీకి కనిపించడం లేదా అని ప్రశ్నించారు. యాష్కీ నోరును అదుపులో పెట్టుకోవాలని సూచించారు.
ఎమ్మెల్సీ ఫారూఖ్ హుస్సేన్ మాట్లాడుతూ.. మధుయాష్కీ స్థాయిని మించి మాట్లాడుతున్నారు. పనిచెయ్యకపోతే విమర్శలు కానీ.. అభివృద్ధి చేస్తుంటే విమర్శలు చేస్తారా? మధుయాష్కీ ఎక్కడా తిరుగకుండా రాష్ట్ర ప్రజలు అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. ఎమ్మెల్సీ పురాణం సతీష్ కుమార్ మాట్లాడుతూ కమీషన్ల కోసం బీ- ఫామ్ లు అమ్ముకున్న చరిత్ర మధుయాష్కీది అన్నారు.
ఎమ్మెల్యే కోరుకంటి చందర్ మాట్లాడుతూ.. తెలంగాణ అభివృద్ధిని అడ్డుకోవడమే ప్రతిపక్షాల లక్ష్యంగా కనిపిస్తోందన్నారు. ఎన్ని అవాంతరాలు అడ్డువచ్చినా కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి చేసిన ఘనత కేసీఆర్ది అని కొనియాడారు. ఇప్పుడు కూడా ఎన్ని అడ్డంకులు వచ్చినా దళితబంధు పథకం ఆగదని స్పష్టం చేశారు. ఈటెల రాజేందర్ బావమరిది దళితులపై చేసిన విమర్శలపై దళితులు కన్నెర్ర చేస్తున్నారు. దళితుల కోసం ప్రవేశపెట్టిన పథకం బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఉన్నాయా? అని ప్రశ్నించారు. తెలంగాణ ప్రజల అభివృద్ధి కోసం కేసీఆర్ కృషి చేస్తుంటే ప్రతిపక్షాలు ఓర్వలేకపోతున్నాయని దుయ్యబట్టారు. ప్రజా పథకాలను అడ్డుకుంటే ప్రతిపక్షాలను ప్రజలు రోడ్లెక్కనివ్వరని హెచ్చరించారు.