భద్రాచలం, ఏప్రిల్ 12: భద్రాచలం మాజీ ఎమ్మెల్యే కుంజా బొజ్జి(95) అనారోగ్యంతో సోమవారం కన్నుమూశారు. ఇటీవల అస్వస్థతకు గురైన ఆయన్ను భద్రాచలంలోని ఓ ప్రైవేట్ దవాఖానలో చేర్పించారు. మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్లోని నిమ్స్కు తరలించి వైద్యం అందించారు. ఆదివారం ఆయనను తిరిగి భద్రాచలం తీసుకొచ్చారు. సోమవారం మధ్యాహ్నం ఆయన తుదిశ్వాస విడిచారు. వరరామచంద్రాపురం మండలం అడవివెంకన్నగూడెంకు చెందిన కుంజా బొజ్జి 1926 ఫిబ్రవరి 20న జన్మించారు. మూడుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసినా కనీసం సొంతిల్లు లేకపోవడం గమనార్హం. తనకు వచ్చే పింఛన్తోనే తన కుమార్తె ఇంట్లో జీవనం సాగించారు.
కుంజా బొజ్జి మృతి పట్ల సీఎం కేసీఆర్ సంతాపం తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో భద్రాచలం నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన కుంజా గిరిజన సమస్యల పరిష్కారానికి కృషి చేశారని గుర్తుచేసుకున్నారు. కుంజా కుంటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.