హైదరాబాద్, కరీంనగర్ ప్రతినిధి, ఏప్రిల్ (నమస్తే తెలంగాణ): ఆరు దశాబ్దాలపాటు రాష్ట్ర రాజకీయాల్లో తనదైన ముద్రవేసిన కాంగ్రెస్ సీనియర్నేత, మాజీమంత్రి మేనేని సత్యనారాయణరావు (87) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయనకు కరోనా సోకడంతో నిమ్స్ దవాఖానలో చేర్చారు. అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం తెల్లవారుజామున కన్నుమూశారు. ఎమ్మెస్సార్గా రాష్ట్ర ప్రజలు పిలుచుకునే ఆయనకు రాజకీయాల్లో ముక్కుసూటి మనిషిగా పేరున్నది. ఎమ్మెస్సార్ మృతికి ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు తీవ్ర సంతాపం వ్యక్తంచేశారు. మంచి నాయకుడ్ని కోల్పోయామని సీఎం పేర్కొన్నారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ప్రభుత్వ లాంఛనాలతో జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో ఎమ్మెస్సార్ అంత్యక్రియలు మంగళవారం పూర్తయ్యాయి. ప్రభుత్వం తరఫున మంత్రులు ఈటల రాజేందర్, సీహెచ్ మల్లారెడ్డి హాజరై ఎమ్మెస్సార్కు నివాళులు అర్పించారు.
సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం
ఎమ్మెస్సార్ 1934 జనవరి 14న కరీంనగర్ జిల్లా రామడుగు మండలం వెదిరె గ్రామంలో జన్మించారు. 1954లో 20 ఏండ్లకే యువజన కాంగ్రెస్లో చేరారు. 1969 వరకు విద్యార్థి నాయకుడిగా, యూత్ కాంగ్రెస్ నాయకుడిగా కొనసాగారు. 1969లో తెలంగాణ తొలిదశ ఉద్యమంలో చురుకుగా పాల్గొన్న ఆయన.. 1971లో కరీంనగర్ లోక్సభ స్థానం నుంచి తెలంగాణ ప్రజాసమితి నుంచి తొలిసారిగా పోటీచేసి విజయం సాధించారు. తర్వాత 1977, 1980లోనూ ఎంపీగా ఎన్నికయ్యారు. వరుసగా మూడుసార్లు ఎంపీగా విజయం సాధించిన ఎమ్మెస్సార్కు ఇందిరాగాంధీతో సన్నిహిత సంబంధాలుండేవి. ఇందిర ఏఐసీసీ అధ్యక్షురాలిగా ఉన్న సమయంలో 1980 నుంచి 1983వరకు ఏఐసీసీ ప్రధానకార్యదర్శిగా, ఆరురాష్ర్టాలకు పార్టీ వ్యవహారాల ఇన్చార్జిగా వ్యవహరించారు. సిట్టింగ్ ఎంపీగా ఉన్న తనకు 1985లో టికెట్ రాకపోవడాన్ని తన జీవితంతో చేదు అనుభవంగా ఎమ్మెస్సార్ తరుచూ చెప్తుండేవారు. 1989లో కరీంనగర్ శాసనసభ నియోజకవర్గం నుంచి పోటీచేసి ఓటమి పాలయ్యారు. 2000 నుంచి 2004 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షుడిగా పనిచేశారు. 2004లో కరీంనగర్ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొంది వైఎస్ఆర్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. మంత్రిగా కొనసాగుతూనే 2006 డిసెంబర్లో కరీంనగర్ లోక్సభకు జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేసి టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేతిలో రెండులక్షలకుపైగా ఓట్లతేడాతో ఓటమి చవిచూశారు. దీంతో మంత్రి పదవికి రాజీనామా చేశారు. తర్వాత 2007 నుంచి 2014 వరకు వరుసగా మూడుసార్లు ఆర్టీసీ చైర్మన్గా కొనసాగారు.
ముక్కుసూటి మనిషిని కోల్పోయాం
ఎమ్మెస్సార్ మృతికి సీఎం కేసీఆర్
మాజీమంత్రి ఎం సత్యనారాయణరావు మృతిపై సీఎం కేసీఆర్ తీవ్ర సంతాపం వ్యక్తంచేశారు. తెలంగాణవాదిగా, ఎంపీగా, మంత్రిగా అన్నింటా ప్రత్యేకశైలి కనబరిచారని గుర్తుచేసుకున్నారు. ఒకమంచి నాయకుడ్ని కోల్పోయామని, రాజకీయాల్లో ముక్కుసూటి మనిషిగా పేరొందారని తెలిపారు. ఎమ్మెస్సార్ కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఎమ్మెస్సార్ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానని మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. తొలితరం తెలంగాణ ఉద్యమకారుడైన ఎమ్మెస్సార్ కరీంనగర్ ఎంపీగా, మంత్రిగా తన ప్రత్యేకత చాటుకున్నారని రాష్ట్ర ప్రణాళికాసంఘం వైస్చైర్మన్ బీ వినోద్కుమార్ తెలిపారు. పార్లమెంట్లో ఆయన ప్రసంగాలను సేకరించి పుస్తకరూపంలో తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్టు చెప్పారు. ఎమ్మెస్సార్ మృతికి మంత్రి కేటీఆర్ తీవ్ర సంతాపం వ్యక్తంచేశారు. మంత్రులు పువ్వాడ అజయ్కుమార్, వేముల ప్రశాంత్రెడ్డి, నిరంజన్రెడ్డి, మాజీగవర్నర్ విద్యాసాగర్రావు తదితరులు సంతాపం తెలిపారు.