హైదరాబాద్, జూన్ 1 (నమస్తే తెలంగాణ): ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ప్రభుత్వ ప్రధానకార్యదర్శి ఎస్వీ ప్రసాద్, ఆయన భార్య లక్ష్మి కరోనాతో మృతిచెందారు. హైదరాబాద్లో నివసిస్తున్న ఎస్వీ ప్రసాద్ కుటుంబం మొత్తం కొద్దిరోజుల క్రితం కరోనా బారినపడింది. భార్యాభర్తలిద్దరు తీవ్ర అనారోగ్యంతో ఓ ప్రైవేటు దవాఖానలో చేరారు. చికిత్స పొందుతూ పరిస్థితి విషమించటంతో మంగళవారం వీరిద్దరు తుదిశ్వాస విడిచారు. గంటల వ్యవధిలోనే భార్యాభర్తలిద్దరు మృతిచెందటం గమనార్హం. ఎస్వీ ప్రసాద్ మృతికి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు, ఏపీ సీఎం జగన్మోహన్రెడ్డి, హిమాచల్ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ సంతాపం తెలిపారు. ఎస్వీ ప్రసాద్ మృతిపట్ల సంతాపం వ్యక్తం చేసిన సీఎం కేసీఆర్.. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. శాసనసభ్యుడిగా తాను పనిచేసిన కాలం నుంచి ఎస్వీ ప్రసాద్ తనకు పరిచయమని వెంకయ్యనాయుడు గుర్తుచేశారు. అహ్మదాబాద్ ఐఐఎంలో ఎంబీఏ పూర్తిచేసిన ఎస్వీ ప్రసాద్ 1975 బ్యాచ్కు చెందిన ఐఏఎస్ అధికారి. నెల్లూరు జిల్లా సబ్ కలెక్టర్గా తన కెరీర్ను ప్రారంభించారు. కడప, విశాఖపట్నం జిల్లాల కలెక్టర్గా పనిచేశారు. అనేక శాఖలకు కార్యదర్శిగా, ముఖ్యకార్యదర్శిగా సేవలందించారు. 2010లో రోశయ్య ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పని చేశారు. తనకంటే 20 మంది సీనియర్ ఐఏఎస్ అధికారులున్నప్పటికీ సీఎస్ పోస్టు ఎస్వీ ప్రసాద్నే వరించింది. పదేండ్లకు పైగా ముగ్గురు ముఖ్యమంత్రులు నెదురుమల్లి జనార్థన్రెడ్డి, కోట్ల విజయభాస్కర్రెడ్డి, చంద్రబాబు వద్ద సీఎం ముఖ్యకార్యదర్శిగా ఆయన విధులు నిర్వర్తించారు.