కరీంనగర్ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టి అమలుచేస్తున్న పల్లె, పట్టణ ప్రగతి, హరితహారం కార్యక్రమాలలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. జూలై 1 నుంచి 10 వతేది వరకు నిర్వహించే పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి, తెలంగాణకు హరితహారం కార్యక్రమాల అమలుపై సోమవారం కరీంనగర్ వి కన్వెన్షన్ లో ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి సన్నాహక సమావేశానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు . ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. పల్లెలు పట్టణాలుగా మారాలని పట్టణాలు ఆధునీకరణ చెంది బంగారు తెలంగాణ నిర్మాణం కావాలన్నారు.
పల్లె, పట్టణ ప్రజలు అందరూ ఆరోగ్యంగా సంతోషంగా జీవించాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ పల్లె ప్రగత, పట్టణ ప్రగతి, తెలంగాణకు హరితహారం కార్యక్రమాలను ప్రవేశపెట్టారని మంత్రి తెలిపారు . పల్లె, పట్టణ ప్రగతి లో చేపట్టే అభివృద్ధి కార్యక్రమాలకు ప్రభుత్వం నేరుగా స్థానిక సంస్థలకు నిధులు మంజూరు చేస్తుందని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పారిశుద్ధ్య పనులకు అత్యంత ప్రాధాన్యతనిచ్చి గ్రామాలలో పారిశుద్ధ్య పనులను ప్రతిరోజు ముమ్మరంగా నిర్వహించేలా చేపట్టిన చర్యలవల్ల ప్రజలందరూ ఆరోగ్యంగా ఉంటున్నారని తెలిపారు.
పల్లె ప్రగతి ,పట్టణ ప్రగతి ,హరితహారం కార్యక్రమాల అమలుపై మంగళవారం మండల స్థాయిలో ప్రజా ప్రతినిధులు అధికారులతో సన్నాహక సమావేశాలు నిర్వహించాలని మంత్రి ఆదేశించారు. పల్లె ప్రగతిలో భాగంగా గ్రామాలకు మంజూరు చేసిన వైకుంఠ ధామల నిర్మాణ పనులు పూర్తి చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు.
పల్లె ప్రగతిలో గ్రామాలలో ప్రమాదకరమైన పాత బావులను గుర్తించి పూడ్చి వేయాలని, రోడ్లపై నీరు నిలువకుండా తగిన చర్యలు తీసుకోవాలని అన్నారు. విధుల్లో అలసత్వం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనంతరం హరితహారంపై ముద్రించిన పోస్టర్లను మంత్రి ఆవిష్కరించారు.
కార్యక్రమంలో ఎమ్మెల్సీ భాను ప్రసాదరావు, జిల్లా కలెక్టర్ కె .శశాంక, మానకొండూరు, చొప్పదండి శాసనసభ్యులు రసమయి బాలకిషన్, సుంకే రవిశంకర్, నగర మేయర్ వై .సునీల్ రావు, సుడా చైర్మన్ జి.వి రామకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.