CM KCR | రైతుల హక్కుల కోసం ఐఏఎస్కు రాజీనామా చేసి మరీ తుదిశ్వాస విడిచేంతవరకూ పోరాడిన మహారాష్ట్ర షేత్కరీ సంఘటన్ నాయకుడు శరద్జోషి ప్రభావంతో 15 ఏండ్ల ప్రాయం నుంచే రైతు ఉద్యమాలతో మమేకమయ్యారు. దాదాపు 25 ఏండ్లపాటు రైతుల హక్కుల కోసం, ఆత్మహత్యల నివారణ కోసం అవిశ్రాంతంగా పోరాడుతూనే ఉన్నారు. మహారాష్ట్ర అంతటా రైతులను చైతన్యవంతులను చేస్తున్నారు. ఎప్పుడూ రాజకీయ పార్టీలకు అంటీముంటనట్టుగా ఉన్నారు. కానీ ఇటీవలే భారత రాష్ట్ర సమితిలో చేరారు. పార్టీ మహారాష్ట్ర కిసాన్ సెల్ అధ్యక్షుడిగా నియమితులయ్యారు మాణిక్రావు కదం. తెలంగాణ సీఎం కేసీఆర్లో ఆయనకు నచ్చిందేమిటి? ఎందుకు పార్టీలో చేరారు? మహారాష్ట్రలో గులాబీ జెండాకు లభిస్తున్న ఆదరణ ఎలా ఉంది? అక్కడి రాజకీయాలు ఎలా కొనసాగుతున్నాయి? తదితర అంశాలను ఆయన మాటల్లోనే తెలుసుకొందాం.
రైతుల ఆత్మహత్యల్లో దేశంలోనే మహారాష్ట్ర నంబర్ వన్ అనే విషయం అందరికీ తెలుసు. కానీ, ఆ మొత్తం ఆత్మహత్యల్లో దాదాపు 80 శాతం వరకు మరాఠ్వాడా, విదర్భ రీజియన్లోనే నమోదవుతాయి. కారణం ఒక్కటే ప్రభుత్వాల వైఫల్యం. సాగునీటి వసతి కల్పించలేదు. వర్షాధారంగా సాగు చేయాల్సిన దుస్థితి. కరంట్ ఎప్పుడు వస్తుందో? పోతుందో? తెలియదు. సూటిగా చెప్పాలంటే కరెంటు వస్తే ఇక్కడ వార్త. అంటే పరిస్థితి అర్థం చేసుకోండి. వ్యయ ప్రయాసలకు ఓర్చి పంట పండిస్తే రేటు ఉండదు. ప్రభుత్వం కొనదు. దళారులకు అమ్ముకోవాల్సిందే. మీ కళ్ల ముందు కనిపిస్తున్న ఉల్లి రైతుల ఉద్యమమే అందుకు నిదర్శనం. పెట్టుబడి కూడా చేతికి రాని దుస్థితి. ఇక విద్య, వైద్యం, పెండ్లి మొదలగు వాటికి అప్పులు చేయకతప్పని పరిస్థితి. అదీగాక ప్రకృతి వైపరీత్యాలు. ఇవే రైతుల ఆత్మహత్యలకు ప్రధాన కారణం. ఇక్కడి రైతులవి ప్రభుత్వం చేస్తున్న హత్యలు.
ఇక్కడి ప్రభుత్వాలు రైతుల సంక్షేమాన్ని ఏమాత్రం పట్టించుకున్నా ఇన్ని ఆత్మహత్యలు ఎందుకు నమోదవుతాయి. సాగునీరు ఇవ్వరు. కరెంటు ఇవ్వ రు. పండిన పంటలను కొనరు. రైతులను గాలికి వదిలేశారు. పెట్టుబడి కూడా రాని దుస్థితి.
రైతుల హక్కుల కోసం తుదిశ్వాస విడిచేంత వరకు పోరాటం చేసిన మహనీయుడు శరద్జోషి ప్రభావం నాపై ఎంతగానో ఉంది. 15 ఏం డ్ల వయస్సు నుంచి రైతు ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొంటున్నా. స్వాభిమాన్ షేత్కరీ సంఘటన్, షేత్కరీ సంఘర్ష్ సమితి ఏర్పాటు చేసి క్రియాశీలకంగా పనిచేస్తున్నా. 25 ఏండ్లుగా రైతుల సమస్యలపై పోరాటం చేస్తున్నా. కానీ మొట్టమొదటిసారిగా ఓ విజన్ ఉన్న నాయకుడు కేసీఆర్ను చూశా. నేను బాసరకు తరచుగా వస్తుంటా. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు ముందు చూసిన తెలంగాణకు ఇప్పటి తెలంగాణకు పోలికే లేదు. చాలా ఆశ్చర్యం వేస్తుండేది. కేసీఆర్ పథకాలు రైతు బంధు, రైతు బీమా, ఉచిత కరెంటు తదితర వాటి గురించి చెప్పగా తెలుసుకొని ఆశ్చర్యపోయా. దశాబ్దాలుగా మేం పోరాటం చేస్తున్న డిమాండ్లను తెలంగాణలో ఆచరణలో పెడుతున్నారు. శరద్జోషి స్వప్నాలను సాకారం చేస్తున్నారు. ఈక్రమంలో ఊహించని విధంగా కేసీఆరే ఓ రోజు ఫోన్ చేశారు. బీఆర్ఎస్ ఏర్పాటు గురించి చెప్పి ఆహ్వానించారు. రైతుల సర్కార్ కోసం భాగం కావాలనుకున్నా. చేరిపోయా.
తెలంగాణ మాడల్ గురించి, సీఎం కేసీఆర్ పథకాల గురించి ఎంత చెప్పినా తక్కువే. మీకో విషయం చెబుతా. కొన్నేండ్ల క్రితం లాతూరు జిల్లాలో ఓ ఘటన జరిగింది. బిడ్డ పెండ్లి కోసం తల్లిదండ్రులు తమ రెండెకరాలను అమ్మాలని నిర్ణయించుకొన్నారు. ఆ విషయం తెలిసి, తల్లిదండ్రుల బాధను చూడలేక కూతురు తమ వ్యవసాయబావిలోనే దూకి ఆత్మహత్య చేసుకొన్నది. ఈ ఘటన మహారాష్ట్రలో సంచలనం రేపింది. నన్ను కూడా ఎంతో కలిచివేసింది. అలాంటి తల్లిదండ్రులను ఆదుకొనేందుకు తెలంగాణలో కేసీఆర్ కల్యాణలక్ష్మి పథకాన్ని అమలుచేయడం ఆనందాన్ని కలిగించింది. రైతుల అప్పులకు ప్రధాన కారణాల్లో పిల్లల పెండ్లిళ్లు కూడా ఒకటి. చివరాఖరికి ఆ భారం కూడా రైతులపై పడకుం డా కల్యాణలక్ష్మి అమలు చేయడం కేసీఆర్ ప్లానింగ్ ఎంతటి మైక్రో లెవల్లో ఉంటుందనేదానికి అద్దం పడుతున్నది. రైతులు ఆత్మహత్య చేసుకున్నా, అనారోగ్యంతో మృతి చెందినా వారి కుటుంబాలు రోజువారీ ఖర్చులకు ఎలా ఇబ్బందులకు గురవుతాయో నాకు తెలుసు. స్వయంగా చూశా. ఎంతో మందిని ఆదుకొనేందుకు విరాళాలు సేకరించాం. కానీ తెలంగాణ సర్కారు రైతు ఎలాంటి కారణంతో చనిపోయినా బీమా కింద రూ.5 లక్షలు ఇవ్వడం గొప్ప విషయం. ప్రపంచంలోనే అది ఎక్కడా లేదు. ఇలా చెప్పుకుంటూ పోతే ఆసరా పింఛన్లు, కంటి వెలుగు ఎన్నో పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయి.
నాందేడ్ సభకు తరలివచ్చిన ప్రజలను చూశారు కదా.. బీఆర్ఎస్ పార్టీకి ఇక్కడి ఆదరణ ఎలా ఉందో అర్థమై ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ ప్రతి రైతు నోటా ఒకటే నినాదం ‘అబ్కీ బార్ కిసాన్ సర్కార్’. నాడు కాంగ్రెస్, నేడు బీజేపీ ప్రభుత్వాలు ఏనాడూ రైతుల సమస్యలను పట్టించుకోలేదు. ఏ ఒక్క హామీని నెరవేర్చలేదు. పక్కపక్కనే ఉన్న భూములు.. తెలంగాణలో పచ్చగా ఉంటే.. ఇక్కడ నెర్రెలిడ్సిన దృశ్యాలు కండ్లముందు కనవడ్తున్నవి. అందుకు కారణాలు కూడా రైతులకు తెలుసు. అందుకే బీఆర్ఎస్కు, కేసీఆర్ సాబ్కు ఘనస్వాగతం పలుకుతున్నారు.
– కంధార్ -లోహా నుంచి మ్యాకం రవికుమార్