రాయ్ పూర్ : రాష్ట్రాల ప్రమేయం లేకుండా వ్యాక్సినేషన్ ప్రక్రియను కేంద్ర ప్రభుత్వమే స్వయంగా నిర్వహించాలని చత్తీస్ ఘడ్ ఆరోగ్య శాఖ మంత్రి టీఎస్ సింగ్ దేవ్ కోరారు. వ్యాక్సిన్ల కొనుగోలుకు రాష్ట్రాల నుంచి కేంద్ర ప్రభుత్వం నిధులను కోరవచ్చని పేర్కొన్నారు. ఒకరి చేతుల మీదుగానే వ్యాక్సిన్లను సమీకరించాలని, అవసరమైతే రాష్ట్రాల నుంచి వ్యాక్సిన్ల కొనుగోలుకు కేంద్రం డబ్బులు తీసుకోవచ్చని సింగ్ దేవ్ స్పష్టం చేశారు.
తాను ఇదే విషయం కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ కూ వివరించానని చెప్పారు. ప్రధాని నరేంద్ర మోదీ పలు రాష్ట్రాల సీఎంలు, అధికారులతో కరోనా పరిస్థితిపై సమీక్షించిన అనంతరం సింగ్ దేవ్ ఈ వ్యాఖ్యలు చేశారు. మరోవైపు చత్తీస్ ఘడ్ లో గడిచిన 24 గంటల్లో 5212 తాజా పాజిటివ్ కేసులు వెలుగుచూడగా ఒక్కరోజులో 113 మంది మహమ్మారితో బాధపడుతూ ప్రాణాలు విడిచారు.