శ్రీశైలం : శ్రీశైల క్షేత్ర దర్శనానికి వచ్చే భక్తులు ఆలయ నిబంధనలు తప్పక పాటించాలని ఈవో లవన్న కోరారు. ఆధ్యాత్మికంగా ఉండే పవిత్రమైన వాతావరణాన్ని కలుషితం చేస్తూ తోటి యాత్రికులకు ఇబ్బందులు కలిగించే చర్యలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. దేవస్థానం సిబ్బంది సహా, స్థానికంగా ఉండే వారు కూడా మద్యం.. మాంసం, పొగాకు పదార్థాలను క్షేత్ర పరిధిలోనికి తీసుకువచ్చే ప్రయత్నాలు చేస్తే.. దేవాదాయ ధర్మాదాయ నిబంధనల చట్టం ప్రకారం కేసులు నమోదు చేయించి శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఆలయ భద్రతా ప్రమాణాల దృష్ట్యా తనిఖీలు చేసే పోలీసు, సెక్యూరిటీ సిబ్బందికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు.