ప్రజల తీర్పుతో ప్రతిపక్షాలకు చెంపపెట్టు
అభివృద్ధికి పట్టం కట్టిన నగర ఓటర్లకు ప్రత్యేక కృతజ్ఞతలు
బీజేపీకి నోటాకు వచ్చిన ఓట్లూ రాలేదు..
ఎమ్మెల్యేలు సండ్ర, రాములునాయక్, ఎమ్మెల్సీ బాలసాని, జడ్పీ చైర్మన్ లింగాల
ఖమ్మం, మే 4 : కార్పొరేషన్ సాధారణ ఎన్నికల్లో టీఆర్ఎస్, సీపీఐ అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించిన నగర ప్రజలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. మంగళవారం ఖమ్మంలోని వీడీఓస్ కాలనీలోని మంత్రి పువ్వాడ క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో సత్తుపల్లి, వైరా ఎమ్మెల్యేలు సండ్ర వెంకటవీరయ్య, లావుడ్యా రాములు నాయక్, జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్రాజ్, నూతనంగా ఎన్నికైన కార్పొరేటర్లు, ప్రజా ప్రతినిధులు, పార్టీ నాయకులతో కలిసి ఆయన మాట్లాడారు. సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు ప్రజలకు మేలు చేస్తున్నాయని, మంత్రి పువ్వాడ అజయ్కుమార్ అధ్వర్యంలో నగరంలో జరుగుతున్న అభివృద్ధి పనులను మెచ్చిన ఓటర్లు టీఆర్ఎస్, సీపీఐ అభ్యర్థులను గెలిపించారని అన్నారు. 60 డివిజన్లకు గాను టీఆర్ఎస్ 43, సీపీఐ 2 డివిజన్లలో కార్పొరేటర్లను గెలిపించి అభివృద్ధికి మద్దతు తెలిపారని పేర్కొన్నారు. నగరం హైదరాబాద్కు దీటుగా అభివృద్ధి చెందిందన్నారు. ఎన్నికలకు ముందు ప్రతిపక్ష పార్టీలకు చెందిన నాయకులు మంత్రి పువ్వాడ, ప్రభుత్వంపై అబద్ధాల ప్రచారం చేశారని, దాన్ని ప్రజలు నమ్మలేదని అన్నారు.
అభివృద్ధికి పట్టం కట్టిన ఓటర్లకు ప్రత్యేక కృతజ్ఞతలు..
సత్తుపల్లి, వైరా ఎమ్మెల్యేలు సండ్ర, రాములునాయక్
ఖమ్మం నగరంలో అభివృద్ధి పనులు, సీఎం కేసీఆర్ పాలనపై ప్రజలకు ఉన్న నమ్మకాన్ని కార్పొరేషన్ ఎన్నికల ద్వారా ఓటర్లు తెలియజేశారని, టీఆర్ఎస్, సీపీఐ అభ్యర్థులకు ఓట్లు వేసిన అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని ఎమ్మెల్యేలు అన్నారు. సీఎం కేసీఆర్ జిల్లా అభివృద్ధికి ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తున్నారన్నారు. విపత్కర పరిస్థితుల్లోనూ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందన్నారు. ఖమ్మంలో గతంలో పాలించిన పార్టీలను కాదని టీఆర్ఎస్ పార్టీకి ప్రజలు రెండోసారి బ్రహ్మరథం పట్టారన్నారు. వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా రానున్న రోజుల్లో నగరాన్ని మరింత అభివృద్ధి చేస్తామన్నారు. నూతనంగా ఎన్నికైన కార్పొరేటర్లపై మరింత బాధ్యతలు ఉన్నాయన్నారు.
బీజేపీకి నోటాకు వచ్చిన ఓట్లు కూడా రాలేదు..:
జడ్పీ చైర్మన్ లింగాల కమల్రాజు
ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీ చేసిన కొన్ని పార్టీల నాయకులకు నోటాకు వచ్చిన ఓట్లు కూడా రాలేదని జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్రాజ్ అన్నారు. ఖమ్మంలో మతోన్మాదానికి చోటు లేదని నగర ఓటర్లు తమ ఓటు ద్వారా తీర్పు ఇచ్చారని అన్నారు. అన్ని డివిజన్లలో పోటీ చేసిన బీజేపీ అభ్యర్థులకు నోటాకు వచ్చిన ఓట్లు కూడా రాలేదని ఆయన ఎద్దేవా చేశారు. మంత్రి పువ్వాడ అజయ్కుమార్ అభివృద్ధిని చూసి ప్రజలు ఓటేశారన్నారు. సమావేశంలో సుడా చైర్మన్ బచ్చు విజయ్కుమార్, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ బానోత్ చంద్రావతి, డీసీసీబీ చైర్మన్ కూరాకుల నాగభూషణం, టీఆర్ఎస్ జిల్లా కార్యాలయ ఇన్చార్జ్జి ఆర్జేసీ కృష్ణ, డీసీఎంఎస్ చైర్మన్ రాయల శేషగిరిరావు, సీపీఐ జిల్లా కార్యదర్శి పోటు ప్రసాద్, సీపీఐ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు జానీమియా, టీఆర్ఎస్ నగర అధ్యక్షుడు కమర్తపు మురళి, నూతనంగా ఎన్నికైన టీఆర్ఎస్ కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు.