న్యూఢిల్లీ, మే 26: గాలి ద్వారా కరోనా వైరస్ వ్యాపిస్తుందని కేంద్ర ఆరోగ్యశాఖ పునరుద్ఘాటించింది. కరోనా రోగి దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు, మాట్లాడినప్పుడు వెలువడే తుంపర్ల ద్వారా మహమ్మారి వ్యాపిస్తుందని పేర్కొంది. ఈ మేరకు కొవిడ్-19 క్లినికల్ మేనేజ్మెంట్ గైడ్లైన్స్ను బుధవారం సవరించింది. ఆ వివరాలు..
కరోనా వైరస్ సోకిన వ్యక్తి దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు, మాట్లాడినప్పుడు వైరస్ గాలి ద్వారానే ఎక్కువగా వ్యాపిస్తుంది.
పడిన ప్రదేశం స్వభావాన్ని బట్టి రోగి తుంపర్లలోని వైరస్ మనుగడ ఆధారపడి ఉంటుంది.
తుంపర్లు రెండు మీటర్ల దూరం వరకు, గాలిలోని వైరస్ (ఏరోసోల్స్) 10 మీటర్ల దూరం వరకు ప్రయాణించవచ్చు. వ్యక్తుల మధ్య 10 మీటర్ల దూరం నియమం మేలు.
ఎప్పుడూ మూసి ఉంచే గదుల్లో ఏరోసోల్స్ ప్రమాదకరంగా మారుతున్నాయి. వీటి ద్వారానే గాలి నుంచి వైరస్ వేగంగా వ్యాపిస్తున్నది. అందుకే ఇండ్లు, పని ప్రదేశాల్లో గాలి, వెలుతురు బాగా వచ్చేలా చూసుకోవాలి.
వైరస్ పరిణామక్రమానికి తగ్గట్టు మెదలాలి
వైరస్ పరిణామక్రమాన్ని అనుసరించి చికిత్సలో మార్పులు చేయాల్సిన అవసరమున్నదని కేంద్రం అభిప్రాయపడింది. ప్లాస్మా థెరపీని ఉదహరించింది. ప్లాస్మా చికిత్సతో ప్రయోజనం లేదని ఎయిమ్స్, ఐసీఎంఆర్ అధ్యయనాలు సూచించడం వల్లే ‘ప్లాస్మా థెరపీ’ని చికిత్స విధానం నుంచి తీసివేసినట్టు వివరించింది.