హైదరాబాద్, జూన్ 24 (నమస్తే తెలంగాణ): తక్కువ స్థలంలోనే ఎక్కువ మొక్కలు నాటి.. అవి వృక్షాలుగా ఎదిగేలా చేసి చిట్టడువులను సృష్టించడం జపాన్ వారి మియావాకీ పద్ధతి. ఈ పద్ధతికి సింగరేణి కూడా వేదికయ్యింది. సింగరేణి డైరెక్టర్ బలరాం.. మియావాకీ పద్ధతిలో తక్కువ ప్రదేశంలో చిట్టడవిని సృష్టించాలని ఆలోచించి భూపాలపల్లి పరిధిలోని కేటీకే 5 ఇైంక్లెన్లో మొక్కలను నాటారు. దాదాపు 650 మొక్కలను ఆయన సొంతంగా నాటారు. అవన్నీ ఇప్పుడు వృక్షాలుగా ఎదుగుతూ చిట్టడివిని తలపిస్తున్నాయి. ఇప్పుడు ఆ ప్రదేశం వివిధ రకాల పక్షలు, కీటకాలకు నిలయంగా మారింది. పెరుగుతున్న చెట్లపై అనేక రకాల పక్షులు గూళ్లు కట్టుకుని నివాసం ఏర్పాటు చేసుకున్నాయి. ఆ ప్రాంతమంతా పక్షుల కిలకిలారావాలతో, కీటకాలకు నిలయంగా మారుతుండటంతో.. పర్యావరణ ప్రేమికులు అమిత ఆనందం వ్యక్తంచేస్తున్నారు.
పర్యావరణ ప్రేమికుడైన సింగరేణి డైరెక్టర్ బలరాం ప్రతి ఏడాది హరితహారం కార్యక్రమంలో పాల్గొంటూ వందల సంఖ్యలో మొక్కలు నాటారు. 2019 జూన్ 5న మొదటిసారిగా కొత్తగూడెం బంగ్లాస్ ఏరియాలో బలరాం 105 మొక్కలను నాటి ఇతర ఉద్యోగులు, సిబ్బందికి ఆదర్శంగా నిలిచారు. అలాగే జూలై 20న శ్రీరాంపూర్లోని ఉపరితల గని మట్టికుప్పపై మెగా హరితహారంలో బాగంగా ఒక గంటలో 1,237 మొక్కలను నాటి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఇది హైరేంజ్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులోకి ఎక్కింది. అదేరోజు జైపూర్ ఎస్టీపీపీలో మరో 501 మొక్కలను నాటారు.
పర్యావరణాన్ని కాపాడేందుకు ప్రతి ఒక్కరు గ్రీన్ ఇండియా చాలెంజ్లో పాల్గొని మొక్కలు నాటాలని టర్కీ కాన్సుల్ జనరల్ అద్నన్ అల్టయ్ ఆల్టినోర్స్ అన్నారు. ఎంపీ సంతోష్కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా చాలెంజ్లో భాగంగా గురువారం జూబ్లీహిల్స్లోని టర్కీ కాన్సులేట్ కార్యాలయంలో ఆయన మొక్కలను నాటారు. ఈ సందర్భంగా ఆల్టినోర్స్ మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించడం ద్వారా కాలుష్యాన్ని నివారించగలమని పేర్కొన్నారు. ఇంతటి మంచి కార్యక్రమాన్ని చేపట్టిన ఎంపీ సంతోష్కుమార్ను కాన్సుల్ జనరల్ అభినందించారు.
సింగరేణి డైరెక్టర్ బలరాం నాటిన మొక్కలు ఇప్పుడు చిట్టడివిగా మారడంపై ఎంపీ సంతోష్కుమార్ హర్షం వ్యక్తంచేశారు. తనకు చాలా సంతోషంగా ఉందని, సీఎం కేసీఆర్ పుట్టిన రోజున నాటిన మొక్కలు పెరిగి పెద్దవిగా అయి పక్షులకు, కీటకాలకు నిలయంగా మారడం చాలా సంతోషంగా ఉందని, ఇది ముఖ్యమంత్రికి మనం ఇస్తున్న అద్భుతమైన కానుక అని ఈ సంతోష్కుమార్ ట్విట్టర్లో పేర్కొన్నారు. మొక్కలు నాటడమే కాకుండా.. వాటిని సంరక్షించే బాధ్యత తీసుకున్న సింగరేణి డైరెక్టర్ బలరాంను ఈ సందర్భంగా అభినందించారు.