బడంగ్పేట, ఏప్రిల్ 18: చిన్ననాటి కలను ఆరురోజుల్లో నెరవేర్చుకున్నాడు. 5,364 మీటర్ల ఎత్తైన ఎవరెస్ట్ బేస్ క్యాంప్ను అధిరోహించాడు రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం మీర్పేటకు చెందిన వేముల సందీప్. వేముల శ్రీహరిరావు, జయ దంపతుల కుమారుడు సందీప్. ఇంజినీరింగ్ చేసి సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. తండ్రి సరోజినిదేవి కంటి వైద్యశాలలో అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేస్తున్నారు. సందీప్కు చిన్నప్పటినుంచి గుట్టలు ఎక్కడం అంటే చాలా ఇష్టం. ఖమ్మంలోని అమ్మమ్మ ఇంటికి వెళ్లినప్పుడల్లా గుట్టలెక్కేవాడు. అదే అతనిలో ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించాలన్న లక్ష్యాన్ని పెట్టుకునేలా చేసింది. ఈ నెల 4న మీర్పేట నుంచి బయలుదేరి నేపాల్ చేరుకున్నాడు. అక్కడినుంచి ఈ నెల 10న ఎవరెస్ట్ బేస్ క్యాంప్నకు చేరుకొని జాతీయ పతాకాన్ని ఎగురవేశాడు. ఇందుకోసం నెలపాటు సాధన చేశానని సందీప్ తెలిపాడు. నేపాల్ గైడ్ దిల్ సాయంతో ఎవరెస్ట్ బేస్ క్యాంప్ను చేరుకున్నట్టు చెప్పాడు. త్వరలో 5,895 మీటర్ల ఎత్తున్న మౌంట్ కిలి మంజారో ఎక్కాలని నిర్ణయించుకున్నట్టు వెల్లడించాడు. ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కాలన్నదే తన లక్ష్యమని చెప్తున్నాడు. ప్రభుత్వం సహకరిస్తే ప్రపంచంలో ఉన్న ఏడు ఎత్తయిన శిఖరాలను అధిరోహిస్తానని సందీప్ పేర్కొన్నాడు.