వరంగల్, జూలై 19(నమస్తే తెలంగాణ ప్రతినిధి): హుజూరాబాద్ ఉప ఎన్నిక లక్ష్యంగా ఈటల రాజేందర్ తలపెట్టిన ‘ప్రజా దీవెన పాదయాత్ర’ సాక్షిగా బీజేపీలోని అంతర్గత విభేదాలు బయటపడ్డాయి. వరంగల్ అర్బన్ జిల్లా కమలాపూర్ మండలం బత్తినివానిపల్లెలో సోమవారం ఈటల పాదయాత్ర ప్రారంభించారు. ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఈ పాదయాత్రకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ రాకపోవడంపై కమలం పార్టీలో చర్చ జరుగుతున్నది. సంజయ్ సొంత లోక్సభ నియోజకవర్గం కరీంనగర్ పరిధిలోనే హుజూరాబాద్ సెగ్మెంట్ ఉంది. ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థిగా ఈటల రాజేందర్ను ఆ పార్టీ ఇప్పటికే ప్రకటించింది. ఈటల చేపట్టిన పాదయాత్రకు బీజేపీ రాష్ట్ర నాయకులు వచ్చినా.. బండి సంజయ్ రాకపోవడంతో ఆ పార్టీ శ్రేణులు పార్టీలోని విభేదాలపై చర్చించుకుంటూ నిరాశతో ఇండ్లకు చేరారు. మొదటి నుంచి బీజేపీలో ఉంటున్న తమకు ఈటల ప్రాధాన్యత ఇవ్వడంలేదని పలువురు చెబుతున్నారు. టీఆర్ఎస్లోనూ అధిష్ఠానం నిర్ణయాలకు భిన్నంగా వ్యవహరించిన ఈటల బీజేపీలోనూ రాష్ట్ర నాయకత్వంతో సఖ్యతగా ఉండటంలేదని భావన వ్యక్తమవుతున్నది. పరిస్థితి ఇలాగే ఉంటే నష్టమేనని బీజేపీ కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు. పాదయాత్ర కోసం ఒక్కొక్కరికి రూ.500 ఇవ్వడంతోపాటు వాహనాలు సమకూర్చారు. శనిగరంలో ఈటల ప్రసంగం తర్వాత బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఇండ్లకు వెళ్లారు. సాయంత్రానికి పాదయాత్ర వెలవెలబోయింది.