వరంగల్ అర్బన్: కేసుల నుంచి తప్పించుకోవడానికి ఈటల రాజేందర్ బీజేపీలో చేరారని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి విమర్శించారు. తాను బీజేపీలో ఎందుకు చేరారో ప్రజలకు ఈటల సమాధానం చెప్పాలని అన్నారు. కమలాపూర్ మండలంలోని పంగిడిపల్లిలో టీఆర్ఎస్ కార్యకర్తలతో నిర్వహించిన సమావేశంలో ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర విభజన అంశాలపై కేంద్ర ప్రభుత్వం ఇప్పటికీ మొండి వైఖరి ప్రదర్శిస్తున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు.
రైతుబంధును వ్యతిరేకిస్తున్నాని చెప్పిన ఈటల.. ఆ పథకం కింద ఇప్పటివరకు రూ.26 లక్షలు ఎందుకు తీసుకున్నారని ప్రశ్నించారు. బీజేపీకి మత రాజకీయాలు తప్ప, ప్రజా సంక్షేమం గురించి అవగాహన లేదని విమర్శించారు. కేంద్రంలో పరిపాలనా లోపం వల్లే గ్యాస్, చమురు, నిత్యావసరాల ధరలు ఆకాశాన్నంటాయన్నారు. పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలు అమలు చేసి అందిస్తున్న ఘనత సీఎం కేసీఆర్దేనని చెప్పారు.
ఈ సందర్భంగా పలువురు కాంగ్రెస్ నేతలు టీఆర్ఎస్ పార్టీలో చేరారు. గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకులు మోకిడే బాబురావు, జములాపురం లింగారావు, సిద్ధే గోపాల్ రావులు ఆ పార్టీకి రాజీనామా చేసి.. ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు.