హైదరాబాద్, ఏప్రిల్ 3 (నమస్తే తెలంగాణ): ఈ ఎండాకాలంలో దక్షిణ తెలంగాణ విద్యుత్తు పంపిణీ సంస్థ పరిధిలోని అన్ని జిల్లాల్లో నిరంతరాయ విద్యుత్తు సరఫరా జరిగేలా చర్యలు తీసుకుంటున్నామని ఎస్పీడీసీఎల్ సీఎండీ రఘుమారెడ్డి తెలిపారు. సీజీఎం, ఎస్ఈలతో శనివారం ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జోనల్, సర్కిల్ అధికారులు రూపొందించిన ప్రత్యేక కార్యాచరణపై సంస్థ డైరెక్టర్ (ఆపరేషన్స్) జే శ్రీనివాసరెడ్డి, చీఫ్ జనరల్ మేనేజర్లు, సూపరింటెండెంట్ ఇంజినీర్లతో చర్చించారు. ఈ సందర్భంగా సీఎండీ మాట్లాడుతూ ఎండాకాలంలో ఏర్పడే అదనపు లోడును తట్టుకునేందుకు వీలుగా 56 పవర్ ట్రాన్స్ఫార్మర్లు, 1,725 డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లు, 11 నూతన 33/11 కేవీ సబ్స్టేషన్లు ఏర్పాటు చేశామని చెప్పారు. విద్యుత్తు ట్రాన్స్ఫార్మర్ల, 33 ఫీడర్ల పనితీరుపై నిరంతర పర్యవేక్షణ ఉండాలని అన్నారు. ఈ ఎండాకాలం ముగిసే వరకు పీక్ సమయాల్లో సూపరింటెండెంట్ ఇంజినీర్ల నుంచి అసిస్టెంట్ ఇంజినీర్ల వరకు తమ పరిధిలోని సబ్స్టేషన్లలో రాత్రి 9 గంటల వరకు అందుబాటులో ఉండాలని ఆదేశించారు. విద్యుత్తు సరఫరాలో అంతరాయాలుంటే 1912, సంస్థ వెబ్సైట్, ట్విట్టర్, ఫేస్బుక్ ద్వారా తెలియజేయాలన్నారు.